తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు (ప్రజాభవన్ భారీకేడ్ల ప్రమాదం)లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాహిల్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యాక్సిడెంట్ తర్వాత అతడు దుబాయ్ పారిపోయాడు. తన తండ్రితో కలిసి గత నాలుగు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. ఇవాళ హైదరాబాద్ వస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు.
గత ఏడాది డిసెంబర్ 23న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. షకీల్ తనయుడు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ ప్రజా భవన్ వద్ద బారీకేడ్లపైకి కారు దూసుకెళ్లడంతో అవి ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే రహేల్ అక్కడి నుంచి తప్పించుకొని తనకు బదులుగా మరో వ్యక్తి కారు నడిపినట్టు చూపించారు. సిసి కెమెరాల ఆధారంగా అసలు నిందితుడు రహేల్గా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు.
ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పీఎస్ పంపి కేసు నమోదు చేయించారు. కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించి అతడపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో లభించిన కాల్డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయటంతోపాటు అరెస్టు చేసి విచారించారు. మెుత్తంగా ఈ కేసులో 8 మంది అనుమానితులను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.
More Stories
ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ దేశంలోనే టాప్
ధాన్యం అక్రమాలపై రేవంత్ తేల్చకపోతే సీబీఐ దర్యాప్తు కోరతాం
రేవ్ పార్టీలో నటి హేమతో సహా 8 మందికి నోటీసులు