ప్రభుత్వంకు సానుకూలంగా పనిచేస్తున్న అధికారులు జాగ్రత్త!

రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని, అయితే కొంత మంది పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆమె హెచ్చరించారు. 

 చేసేదంతా అధికారపార్టీ నేతలు చేసి తిరిగి ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘాలకి ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. జగన్ సొంత జిల్లా కడపకు వెళ్ళినప్పుడు 13 బలగాలను రప్పించుకున్నారని, సీఎంకు ప్రజల అండ ఉంటే ఎందుకు అంతలా బయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. అదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేటలో సభ నిర్వహించినప్పుడు ఐదు బలగాలను మాత్రమే పంపించారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

 రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, పరిశ్రమలు లేవని, ఉపాధి లేకుండా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని సాధినేని యామిని విమర్శించారు. కేంద్రం పంపిస్తున్న నిధులను పక్క దోవ పట్టిస్తున్నారని, సహజ వనరులను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటివన్నీ ప్రశ్నిస్తుంటే దాడులకు దిగుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తి గత దూషణలకు దిగడం సరికాదని ఆమె అధికార పార్టీ నేతలకు హితవు చెప్పారు. నిజమైన సంక్షేమ పాలన అందించాలంటే ప్రజలు ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరారు. పూర్తి స్థాయిలో కేంద్రం పంపించే నిధులను ప్రజలకు అందించాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు.

పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది? ఆమె ప్రశ్నించారు. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని సాధినేని యామిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.

 
డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్‌వాడీలకు న్యాయం చేయలేకపోవటం వంటి వైసీపీ చేస్తున్న అరాచకాలపై ఆమె ధ్వజమెత్తారు. ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని, ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు