ఐదేళ్లలో 248 మంది మావోయిస్టుల హతం

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల నుండి ఎదురవుతున్న శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. దానితో వారి ప్రభావం గల ప్రాంతాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. కేవలం గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. 

2019 నుంచి 2024 ఏప్రిల్‌ 2 వరకు దేశంలో మావోయిస్టులు 248 మంది మృతి చెందినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. సంవత్సరాల వారీగా చూసుకుంటే మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లను పరిశీలిస్తే  2019లో (107), 2020లో (109), 2021లో (82), 2022లో (69), 2023లో (69), 2024 (ఏప్రిల్‌ 2 వరకు) 28 సార్లు ఎన్‌కౌంటర్లు జరిగాయి.

గత ఐదేళ్లలో సుమారుగా 240 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. సంవత్సరాల వారీగా చూసుకుంటే.. 2019లో (65), 2020లో (40), 2021లో (51), 2022లో (30), 2023లో (20), 2024 ఏప్రిల్‌ 2 వరకు (42) మంది మృతి చెందారు. 2019వ సంవత్సరంలో 65 మంది మృతి చెందితే, 2024లో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 42 మంది మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.

గత ఐదేళ్లలో సుమారుగా 1700 మందికిపైగా మావోయిస్టులు అరెస్టయ్యారు. 2019లో (499), 2020లో (438), 2021లో (494), 2022లో (291), 2023లో (428), 2024 (ఏప్రిల్‌ 2 వరకు) 167 మంది అరెస్టయ్యారు. ఇక మావోయిస్టులకు భద్రతా సిబ్బంది జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 140 మంది దాకా భద్రతా సిబ్బంది మృతి చెందారు. 

2019లో (21), 2020లో (36), 2021లో (46), 2022లో (10), 2023లో (25), 2024 (ఏప్రిల్‌ 2 వరకు) 6 గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మావోయిస్టులకు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల వల్ల గత ఐదేళ్లలో సుమారుగా 200 మందికి పైగా పౌరులు చనిపోయారు. 2019లో (46), 2020లో (47), 2021లో (33), 2022లో (36), 2023లో (41), 2024 (ఏప్రిల్‌ 2 వరకు ) 17 మంది పౌరులు మృతి చెందారు.