ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గతంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఫైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. 
 
వారి ఫోన్లు ట్యాపింగ్ చేయటం ద్వారానే గత ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అప్రమత్తమైన్నట్లు తెలుస్తోంది. మెయినాబాద్‌లోని ఫైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరగ్గా అప్పటి ఎస్‌ఐబీ ఓఎస్డీ రాధాకిషన్ రావు బృందం సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేసి, పట్టుకున్నారు.
 
ఆ తర్వాత ఈ కేసులో అనుమానితులుగా పేర్కొన్న బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్‌లకు నోటీసులు ఇవ్వటానికి సిట్ అధికారులు ప్రత్యేక విమానాల్లో వెళ్లినట్లు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం సాధారణమే అయినా, కేవలం నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యేక విమానాలు వినియోగించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. 
 
ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళలకు వెళ్లినట్లు తాజా విచారణలో తేలింది. సదరు విమానం ఓ బీఆర్ఎస్ నేతదిగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
 
2022 అక్టోబర్ 26న అప్పటి ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధం లేదని బిజెపి ఖండించింది. ప్రస్తుతం ఈ కేసులోని నిందితులు బెయిల్‌పై బయటకు రాగా, కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.