చట్టం ఉల్లంఘిస్తే ఫోన్ ట్యాపింగ్ లో కేంద్రం చర్యలు

తెలంగాణలో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంగించినట్లయితే కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరంగా పరిగణించాల్సి ఉంటుందని చెబుతూ ఎవరిదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలిపారు.

ఈసారి తెలంగాణలో బీజేపీ గణనీయంగా పుంజుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసినందుకు తమ ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగినట్లు అనురాగ్ గుర్తు చేశారు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇవ్వడానికి గత కేసీఆర్‌ ప్రభుత్వానికి 6 సంవత్సరాలు పట్టిందని ధ్వజమెత్తారు. 
 
అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామనే ప్రచారాన్ని కొట్టిపారేసారు. తెలంగాణాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ పార్టీ ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలదని ఠాకుర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా ఉందని, అందుకే ఆ పార్టీని నేతులు వీడుతున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రణీత్ రావు బృందం హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ సందర్భంగా పోలీసులు నాంపల్లి కోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు. ఎస్ఐబీ టీం రాజకీయ నాయకులు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానం వస్తుందని వాదించారు.
 
 ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావుపై మరో కేసు నమోదైంది. తన కుమార్తె పేరిట కొనుగోలు చేసిన ఫ్లాటు సేల్‌ డీడ్‌ను బలవంతంగా రద్దు చేయించారని సుదర్శన్‌కుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రాధాకిషన్‌రావుతో పాటు ఎంవీ రాజు, విశ్వనాథరాజు, మరికొందరి పేర్లను జాబితాలో చేర్చారు. 
 
ఫిర్యాదులో పేర్కొన్న మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి విజయనగర్‌ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్‌కుమార్‌ (52) వ్యాపారి. ఆయన స్నేహితులు ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఎంవీ రాజు, సనత్‌నగర్‌కు చెందిన ఏవీకే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌లో పెట్టుబడి పెడితే 10 శాతం వాటా ఇస్తామని సుదర్శన్‌కు సూచించారు. సుదర్శన్‌ రూ.60 లక్షలు ఇవ్వగా 2019లో సనత్‌నగర్‌ జెక్‌ కాలనీలోని అపార్టుమెంటులో ఫ్లాటు ఇచ్చారు.