ఫోన్ ట్యాపింగ్ లో బిఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేస్తూ  ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రయివేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని, పోలీసుల విచారణలో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని తేలిందని పేర్కొన్నారు. 
‘‘అప్పటి ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కేసీఆరే ఫోన్‌ ట్యాపింగ్‌కు బాధ్యత వహించాలి. కేసీఆర్‌ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్‌ జరిగే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, అందుకే ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరతామని తెలిపారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, గవర్నర్‌ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు
దేశ భద్రతకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందని ఆయన మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, సమాజాంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రాజకీయాలకు సంబంధం లేని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ధ్వజమెత్తారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడవుతోందని తెలిపారు. 
 
ఇది చాలా తీవ్రమైన అంశమని, ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటాయని కిషన్ రెడ్డిహెచ్చరించారు.  ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛను కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు హరించివేశాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారని చెబుతూఇది ఆషామాషీ కేసు కాదని, కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.

రాజకీయ లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారని అంటూ ఆయన ఆగరహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల సమయంలోనూ బిజెపి అభ్యర్థులు, నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని తెలిపారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతూ కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేతపై కఠినమైన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

కాగా, పార్టీ ఫిరాయింపులను మొదట బిఆర్‌ఎస్ అని కిషన్ రెడ్డి విమర్శించారు. పార్టీలు మారే నేతలనుకుక్కలు, నక్కలు అంటున్న కెసిఆర్ నాడు ఆ కుక్కలు, నక్కలను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నాడని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ఒకటే అని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు అని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు.