బిజెపికి కర్నాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలు

కర్నాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలను ఎన్‌డిఎ గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బెంగళూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా దక్కకుండా చూడాలని కార్యకర్తలను కోరారు. 2014 ఎన్నికలలో కర్నాటక ప్రజలు తమకు 43 శాతం ఓట్లతో 17 లోక్‌సభ సీట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 
 
2019 ఎన్నికలలో 51 శాతం ఓట్లతో 25 సీట్లు ఇచ్చారని, ఈసారి 60 శాతం ఓట్లతో మొత్తం 28 సీట్లు బిజెపి కూటమికి దక్కేలా కార్యకర్తలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను దేశవ్యాప్తంగా దాదాపు 60 శాతం రాష్ట్రాలను పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజలు మోదీ, మోదీ అంటూ మోదీ  నామస్మరణ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈసారి బిజెపి కార్యకర్తలకు ప్రధాని మోదీ  400కు పైగా సీట్ల టార్గెట్ విధించారని అమిత్ షా గుర్తు చేశారు. 

ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ అవినీతి, కుంభకోణాలలో మునిగిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పోలికే లేదని చెప్పారు.  రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ  సారథ్యంలోని బిజెపి, ఎన్‌డిఎ ఒక వైపు, ఇండియా కూటమికి చెందిన కుటుంబవాదులు, అవినీతిపరులు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. 

తామంతా మోదీ నాయకత్వంలో ఎన్నికల బరిలో తలపడుతున్నామని అమిత్ షా తెలిపారు. 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, పదేళ్లుగా ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న మోదీ ఒక పక్కన ఉన్నారని, ఆయనపైన పావలా అవినీతి ఆరోపణ కూడా ప్రతిపక్షం చేయలేకపోయిందని షా వ్యాఖ్యానించారు.  మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నాయకత్వంలో పదేళ్లపాటు అహంకారులు, అవినీతిపరుల కూటమి అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను అవినీతిపరునిగా ఆయన అభివర్ణిస్తూ కర్నాటక ప్రజలు అవినీతిని సహించరని షా చెప్పారు. 

పదేళ్ల యుపిఎ పాలనలో మీడియా ద్వారా బయటపడిన కుంభకోణాలను ఆయన ఏకరవుపెడుతూ బొగ్గు బ్లాకులు, కామన్‌వెల్త్, 2జి, ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్, భూమికి ఉద్యోగం, జమ్మూ కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ వంటివి ప్రస్తావించారు. దాదాపు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలతో సంబంధం ఉన్న కాంగ్రెస్ మోడీతో పోటీపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

23 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పనిచేసి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని ప్రపంచంలోనే ఏకైక నాయకుడు మోదీయేనని ఆయన కొనియాడారు. కాని మరోపక్క వేసవి వచ్చిదంటే చాలు విదేశాలకు పారిపోయే రాహుల్ గాంధీ ఉన్నారని, ఆయన కోసం ప్రతి ఆరునెలల కోసం కాంగ్రెస్ గాలిస్తుంటుందని షా ఎద్దేవా చేశారు. దేశమంతా సమైక్యంగా మోదీ  వైపు నిలబడిందని ఆయన తెలిపారు.