ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ అవినీతి, కుంభకోణాలలో మునిగిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పోలికే లేదని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బిజెపి, ఎన్డిఎ ఒక వైపు, ఇండియా కూటమికి చెందిన కుటుంబవాదులు, అవినీతిపరులు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు.
తామంతా మోదీ నాయకత్వంలో ఎన్నికల బరిలో తలపడుతున్నామని అమిత్ షా తెలిపారు. 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, పదేళ్లుగా ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న మోదీ ఒక పక్కన ఉన్నారని, ఆయనపైన పావలా అవినీతి ఆరోపణ కూడా ప్రతిపక్షం చేయలేకపోయిందని షా వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నాయకత్వంలో పదేళ్లపాటు అహంకారులు, అవినీతిపరుల కూటమి అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ను అవినీతిపరునిగా ఆయన అభివర్ణిస్తూ కర్నాటక ప్రజలు అవినీతిని సహించరని షా చెప్పారు.
పదేళ్ల యుపిఎ పాలనలో మీడియా ద్వారా బయటపడిన కుంభకోణాలను ఆయన ఏకరవుపెడుతూ బొగ్గు బ్లాకులు, కామన్వెల్త్, 2జి, ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్, భూమికి ఉద్యోగం, జమ్మూ కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ వంటివి ప్రస్తావించారు. దాదాపు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలతో సంబంధం ఉన్న కాంగ్రెస్ మోడీతో పోటీపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
23 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పనిచేసి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని ప్రపంచంలోనే ఏకైక నాయకుడు మోదీయేనని ఆయన కొనియాడారు. కాని మరోపక్క వేసవి వచ్చిదంటే చాలు విదేశాలకు పారిపోయే రాహుల్ గాంధీ ఉన్నారని, ఆయన కోసం ప్రతి ఆరునెలల కోసం కాంగ్రెస్ గాలిస్తుంటుందని షా ఎద్దేవా చేశారు. దేశమంతా సమైక్యంగా మోదీ వైపు నిలబడిందని ఆయన తెలిపారు.
More Stories
`ఓట్ జిహాద్’ పిలుపు.. సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలిపై ఎఫ్ఐఆర్
ఒలింపిక్స్కు పివి సింధు వరుసగా మూడోసారి అర్హత
మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం