జగన్ కేసుల విచారణలో జాప్యంపై సీబీఐని ప్రశ్నించిన సుప్రీం

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసుల విచారణలో జరుగుతున్న తీవ్రమైన జాప్యం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు.
 
 రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, ముఖ్యమంత్రి అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పష్టం చేశారు.
 
బెయిల్‌ రద్దు, కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి కారణాలు చెబుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని,  విచారణ వేగంగా పూర్తిచేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు నెలకు వాయిదా వేసింది.
 
మరోవంక, అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టులో  విచారణ జరిగింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించింది.
 
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్‌ దత్తాల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.