
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యం వల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం, పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీనీ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ `రైతు దీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.
అందులో భాగంగా ఏప్రిల్ 1న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 2న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ తోపాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమలుతో పాటు యుద్ద ప్రాతిపదికన పరిహారం అందజేయాలని, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో బండి సంజయ్ ఉద్యమ సైరన్ ను మోగించారు. దీంతోపాటు ఏప్రిల్ తొలి వారం నుంచి వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయించడంతోపాటు తాలు, తప్ప, తేమ పేరుతో తరుగు లేకుండా ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయించడమే లక్ష్యంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తప్ప, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్ల కల్లాల దగ్గర బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నారు. దీంతోపాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే ‘రైతు దీక్ష’కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని సంజయ్ కోరారు. రాష్టానికి అన్నం పెట్టే రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాజకీయాలను, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు