ఆర్మూర్‌లో తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది. 
 
మధ్యరాత్రి వేళ ఒక్కసారిగి నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు. నీటి ప్రవాహానికి విద్యుత్‌ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్‌ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
 
నిజాం సాగర్‌ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. ఆర్మూర్ లో నీటి పారుదల అధికారులు కాలువను శుభ్రం చేయకపోవడంతో కట్టలు తెగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.  నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంది. 
 
అయితే ఆర్మూర్‌ ప్రాంతంలోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండిపోయింది. కాగా, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు.