ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా సదానంద్‌ దాటే

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సదానంద్ వసంత్ దాతేను కేంద్రం నియమించింది. ఆయన మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. ఆయన ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్తా కొనసాగుతున్నారు. 
 
ఆయన పదవీకాలం ఈ నెల 31తో ముగియనున్నది. ఈ క్రమంలో ఆయన స్థానంలో సదానంద్‌ వసంత్‌ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సదానంద 2026 డిసెంబర్‌ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు.  అదే సమయంలో రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌కుమార్‌ శర్మను  బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌డి) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ఆయన 2026 జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. 
 
ఇది ఇలా ఉండగా, 1991 బ్యాచ్‌కు చెందిన ఉత్తర ప్రదేశ్ కేడర్ ఐపిఎస్ అధికారి, ప్రస్తుతం సిఐఎస్‌ఎఫ్ ప్రత్యేక డిజిగా పని చేస్తున్న పీయూష్ ఆనంద్‌ను ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఆయన రెండు సంవత్సారాల పాటు ఈ పదవిలో ఉంటారు.

సదానంద్ వసంత్ దాతే  గత రెండు సంవత్సరాలుగా మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌గా పని చేస్తున్నారు. ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న పలువురు ఉగ్రవాదులను కూడా అరెస్టు చేశారు. గతంలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ చీఫ్‌గా పని చేసిన సమయంలో రవిపూజారి గ్యాంగ్‌ నిర్మూలనలో కీలకపాత్ర పోషించారు. ఆయన సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటారు.

దివరలో  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో డీఐజీగా కూడా పని చేశారు. ముంబయికి సమీపంలోని మీర్ భయందర్, వసాయి-విరార్ నగరాల్లో పోలీసు కమిషనర్‌గా సేవలందించారు.  26/11 ముంబయి ఉగ్రదాడి సమయంలో సమయంలో అసమాన తెగువను ప్రదర్శించారు. ఉగ్రవాది కసబ్‌ని సజీవంగా పట్టుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయనకు రాష్ట్రపతి పోలీసు సేవాపతకం దక్కింది. 26/11 దాడి తన కెరీర్‌లో సవాల్‌తో కూడకున్నదని చెబుతూ తాను ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.