లండన్‌ రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతి

లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత పిహెచ్‌డి విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భారత పరిశోధక విద్యార్థిని చెయిస్తా కొచ్చర్‌ (33) లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన కళాశాల నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ సెంట్రల్‌ లండన్‌లోని తన ఇంటికి వెళుతుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు సైకిల్‌ ను ఢకొీట్టింది. 

ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్‌ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా  తీవ్రగాయాలపాలైన కొచ్చర్‌ అప్పటికే మృతి చెందారు. ఈ విషయాన్ని తాజాగా కొచ్చర్‌ తండ్రి రిటైర్డ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

‘ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం చెయిస్తా స్నేహితుల్లో, కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. ఇది చాలా బాధాకరం. నేనింకా లండన్‌లోనే ఉన్నా చెయిస్తా అవశేషాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నా ‘ అని లింక్‌డిన్‌లో కొచ్చర్‌ తండ్రి పోస్టు చేశారు. ఆమె తండ్రి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ (రిటైర్డ్‌) మృతదేహాన్ని తీసుకురావడానికి లండన్‌కు చేరుకున్నారు.

హర్యానా గురుగ్రామ్‌కు చెందిన చేష్టా (33) గత సెప్టెంబర్‌లో పీహెచ్‌డీ కోసం లండన్‌ వెళ్లారు. అక్కడ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. గతంలో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్‌లోని నేషనల్‌ బహేవియరల్‌ ఇన్‌సైట్స్‌ యూనిట్‌లో సీనియర్‌ సలహాదారుగా సేవలందించారు. 

చెయిస్తా మృతి పట్ల నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ సంతాపం వ్యక్తం చేశారు. ” చెయిస్తా ఎంతో దైర్య వంతురాలు. ఆమె నీతి ఆయోగ్‌ యూనిట్‌లో నాతో కలిసి పని చేశారు. ఇంత త్వరగా మన నుంచి దూరం కావడం బాధాకరం ” అని పేర్కొన్నారు.