ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వదిలిపెట్టేది లేదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. ఇప్పటి వరకు 46 మంది వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు.

”ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది” అని తెలిపారు. 

“సీ విజిల్‌ యాప్‌లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం. సీ విజిల్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు.ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హౌర్డింగ్‌లు తొలగించాం. 385 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 3 రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయి” అని వివరించారు.

పవన్‌ కల్యాణ్‌ గాజు గ్లాసు చూపించిన అంశంపై నిషేధం లేదని మీనా స్పష్టం చేశారు. ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చని చెబుతూ పూర్తిగా పరిశీలించి అంశం ఆధారంగా నిర్ణయం ఉంటుందిని చెప్పారు. రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అంటూ హింస రహిత, రీపోలింగ్‌ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. 

గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయని, ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతామని చెప్పారు. ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు తీసుకుంటామని చెబుతూ డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నామని చెబుతూ ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని సీఈవో స్పష్టం చేశారు.