కేంద్ర మంత్రిపై చర్యకు ఈసీ ఆదేశం

కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చిక్కుల్లో పడ్డారు. తమిళనాడు ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఈవోను ఎన్నికల కమిషన్  బుధవారంనాడు ఆదేశించింది. కరంద్లాజే ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనపై డీఎంకే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలకు దిగింది. 
 
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు తరువాత తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని కరంద్లాజే ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలు వివాదం కావడంలో ఆమె బుధవారంనాడు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఈసీ ఆమెపై తాజా చర్యలకు దిగింది.

రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సంబంధించిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కరంద్లాజే ఇంతకు ముందు విమర్శలకు దిగారు. రాష్ట్రంలో తమిళనాడు ప్రజలు బాంబులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుజ్జగింపు రాజకీయాలే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. 

ఆమె చేసిన ఆరోపణలపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై న్యాయపరమైన చర్యలు  హెచ్చరించారు.తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద డీఎంకే ఫిర్యాదు చేసింది. త‌మిళ ప్ర‌జ‌ల్ని తీవ్ర‌వాదులుగా చిత్రీక‌రిస్తున్నార‌ని మంత్రిపై డీఎంకే ఆరోపించింది. కేంద్ర మంత్రికి వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని, రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల్ని బీజేపీ అవమానిస్తుంద‌ని, ఆ రాష్ట్రాల ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొడుతోంద‌ని డీఎంకే పేర్కొన్న‌ది.

తమిళ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కరంద్లాజే సామాజిక మాద్యమాల వేదికగా క్షమాపణలు తెలియజేసారు. త‌మిళ సోద‌రులు, సోదరీమణులకు ఓ విష‌యాన్ని స్పష్టం చేయాలనుకొంటున్నానని, తాను స‌దుద్దేశంతో కొన్ని వ్యాఖ్య‌లు చేశామ‌న‌ని, కానీ ఆ వ్యాఖ్య‌లు కొంద‌రికి బాధ‌ను క‌లిగించాయ‌ని, రామేశ్వ‌రం కేఫ్ బ్లాస్ట్‌తో లింకున్న వ్య‌క్తి కృష్ణ‌గిరి ఫారెస్ట్‌లో శిక్ష‌ణ పొందిన‌ట్లు ఆమె వ్యాఖ్యానించారు. 

త‌న వ్యాఖ్య‌ల‌తో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఎవ‌రైనా బాధ‌ప‌డితే, త‌న గుండెల లోతు నుంచి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని, ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు మంత్రి చెప్పారు. కాగా, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి  స్టాలిన్‌పై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు, బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొనే విధంగా రాడిక‌ల్స్ ను సీఎం ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆమె ఆరోపించారు. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.