కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆర్థర్‌ను వైఎస్ షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు.  వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడంతో పాటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నుంచి పోటీచేసే అవకాశం ఉంది.  టికెట్ రాకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆర్థర్ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీని ఓడిస్తానని చెబుతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం. 
 
టికెట్ హామీతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీలో చేరాలని అనుకున్నప్పటికీ ఇక్కడ్నుంచి అభ్యర్థి ఉండటంతో టికెట్ రాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఆర్థర్ 2019లో నందికొట్కూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి గెలిచారు.
 
.ఐప్యాక్‌ సర్వేలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా రిజల్ట్ వచ్చిందని అయిన తనకు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి అధికారులు లేకుండా చేశారని ఆర్థర్ చెప్పుకొచ్చారు. వైసీపీలో ఇమడలేకనే బయటకు వచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.