మల్లారెడ్డి కాలేజీలో ఐటి సోదాలు

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో  ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్‌ చేయడంతో సోమవారం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డుల్లో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. 
 
మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఐటి అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టాడనే దానిపై ఫోకస్‌ పెట్టారు. కాలేజీ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఐటి అధికారులు వాటిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. 
 
ఇప్పటికే కాలేజీ మేనేజ్‌ మెంట్‌, సిబ్బందిని ఐటి అధికారులు ప్రశ్నించారు. బంధువుల పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.