మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ గురువారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ పై సమగ్ర నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ కమిటీ 18,626 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించింది.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీలోని ఇతర సభ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ తదితరులు పాల్గొన్నారు. 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటైనప్పటి నుంచి 191 రోజుల పాటు వివిధ వర్గాల ప్రజలు, నిపుణులు, విశ్లేషకులు, పరిశోధకులతో జరిపిన విస్తృత సంప్రదింపుల ఫలితమే ఈ నివేదిక అని రామ్ నాథ్ కోవింద్ కమిటీ తెలిపింది.
మొదటగా లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ తెలిపింది. ఒకవేళ హంగ్ ఏర్పడితే అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో అయిదేళ్లకు చెందిన తాజా ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని కోవింద్ ప్యానెల్ నివేదికలో పేర్కొన్నది. తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని తెలిపారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. 2029 నుంచే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని నివేదికలో కోరారు.
జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని, ఎన్నికలకు అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా బలగాలను మోహరించాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. సింగిల్ ఎన్నికల రోల్ను ఈసీ తయారు చేయాల్సి ఉంటుంది.
ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటరు ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, `ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ద్వారా భారతీయుల ఆశలు నిజం అవుతాయని పేర్కొన్నారు. జమిలీతో పరిపాలనా వ్యవస్థ వృద్ధి చెందుతుందని నివేదికలో తెలిపారు.
కమిటీ సూచనలు
- దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్ సభ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కోసం కోవింద్ కమిటీ ప్రతిపాదించిన ప్రతిపాదనల్లో ప్రధానమైనది దశలవారీగా ఒకేసారి ఎన్నికలు అమలు చేయడం.
- మొదటి దశలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, రెండో దశలో 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది.
- దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్ సభ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఎదురయ్యే ప్రధాన సవాలు వేర్వేరు సమయాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలేనని కమిటీ తెలిపింది.
- అందువల్ల, ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్ సభ కు ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక సారి లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి మళ్లీ లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితిని పొడగించాలని కోవింద్ కమిటీ సూచించింది.
- రాజకీయ అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, హంగ్ సభ లేదా అవిశ్వాస తీర్మానం ఏర్పడితే, మిగిలిన కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించవచ్చని ప్యానెల్ సూచించింది.
- ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళిక వంటి ఆచరణాత్మక అంశాలను కూడా కోవింద్ ప్యానెల్ నొక్కి చెప్పింది. పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో, లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదించి ఒకే ఓటరు జాబితాను తయారు చేయడం మరియు ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
- ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఎన్ కే సింగ్, అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెందిన ప్రాచీ మిశ్రా రాసిన పేపర్ ను కూడా ఈ నివేదికలో పొందుపర్చారు.
- రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల సంఘం, ఇతర సంబంధిత భాగస్వాములతో ఈ కమిటీ సంప్రదింపులు జరిపింది.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ