72 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా

* తెలంగాణ నుంచి మరో ఆరుగురు అభ్యర్థులు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను క్రమంగా ప్రకటిస్తోంది. ఇప్పటికే 195 మందితో మొదటి జాబితా విడుదల చేసిన కమలం పార్ తాజాగా మరో 72 మందితో రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఇప్పటికే తొలి విడతలో తెలంగాణలో 9 మంది పేర్లను బీజేపీ ప్రకటించగా  తాజాగా ఆరుగురితో కూడిన జాబితాను విడుదల చేసింది. 
 
తొలి జాబితాలో చోటు దక్కని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రెండో జాబితాలో సీటును ఖరారు చేశారు. మొత్తం 11 రాష్ట్రాల నుంచి కొన్ని స్థానాలకు రెండో జాబితాలో అవకాశం కల్పించారు. ఇక తెలంగాణలో వరంగల్, ఖమ్మం మినహా మిగిలిన 15 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కగా, దాద్రానగర్ హవేలీ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఏడుగురు, హర్యానా నుంచి ఆరుగురు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి 20 మంది, త్రిపుర నుంచి ఒకరు, ఉత్తరాఖండ్ నుంచి ఇద్దరు ఉన్నారు.
ప్రముఖ అభ్యర్థులలో హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కర్నాల్ నుంచి హర్యానా తాజా మాజీ ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్, నాగ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పియూష్ గోయల్,  హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ధార్వాడ్‌ నుంచి ప్రహ్లాద్‌ జోషి, బెంగళూరు సౌత్‌ నుంచి తేజస్వి సూర్య, హవేరీ నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైలను అభ్యర్థులుగా ప్రకటించారు.
 
మొత్తం 72 మందితో బీజేపీ లోక్‌‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురు ఉన్నారు. అందులో ఇటీవలె బీజేపీలో చేరిన వారికి కూడా టికెట్ ఇచ్చారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గోడం నగేష్‌‌కు కమలం పార్టీ అవకాశం కల్పించింది. మెదక్ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు అవకాశం దక్కింది. 
 
ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి డీకే అరుణ పేరును ఖరారు చేశారు. మరోవైపు మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీతారాం నాయక్ పోటీ చేయనున్నారు. నల్గొండ స్థానం నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. పెద్దపల్లి సీటును గోమాస శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే తొలి విడతలో 9 మందికి, రెండో విడతలో ఆరుగురికి అవకాశం కల్పించగా తెలంగాణలో ఉన్న మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయలేదు.
 
తొలి జాబితాలో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి భరత్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌లకు అవకాశం కల్పించారు.