`హనుమాన్’ చిత్ర బృందంపై అమిత్ షా ప్రశంసలు

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’, తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇటీవలనే 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది. 

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కె నిరంజన్ రెడ్డికి, అన్ని ఏరియాల్లో బయ్యర్‌లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కమర్షియల్ హిట్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. భారతదేశపు ఆధ్యాత్మిక సంప్రదాయాలను, వాటి నుంచి ఉద్భవించిన సూపర్‌హీరోలను అద్భుతంగా చూపించడంలో విజయం సాధించిన ‘హనుమాన్’ బృందంపై తాజాగా ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 

వారి భవిష్యత్ ప్రాజెక్ట్‌ల కోసం యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు హోంమంత్రి హైదరాబాద్‌కు వచ్చిన నేపధ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, నిర్మాత కె.నిరంజన్ రెడ్డి అమిత్ షాను కలిశారు. హనమాన్ బృందం అమిత్ షాకు హనుమంతుడి షీల్డ్‌ను బహుకరించింది.

అమిత్ షా ఈ సమావేశానికి సంబధించిన ఫోటోలు పంచుకున్నారు.“ఇటీవలి సూపర్‌హిట్ చిత్రం హనుమాన్ లోని ప్రతిభావంతులైన నటుడు శ్రీ తేజాసజ్జా, చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మను కలవడం జరిగింది. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాలను, వాటి నుండి ఉద్భవించిన సూపర్ హీరోలను చిత్ర యూనిట్ అద్భుతంగా చూపించింది. హనుమాన్ టీమ్‌కి వారి భవిష్యత్ ప్రాజెక్ట్‌లకు శుభాకాంక్షలు”అని రాశారు అమిత్ షా.

ఈ ఫోటోలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా చూడవచ్చు. అమిత్ షా ప్రశంసలకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేస్తూ, “మిమ్మల్ని కలవడం ఒక గొప్ప అదృష్టం. మీ మంచి మాటలు, ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయి” అని పేర్కొన్నారు. 

 హీరో తేజ సజ్జా ఆనందం వ్యక్తం చేస్తూ “అమిత్‌షా సార్‌ని కలవడం మాకు గర్వకారణం. మీ మంచి మాటలకు ధన్యవాదాలు సార్ ” అని రాశారు. ఈ సినిమా త్వరలో ఓటీటీ విడుదల కానుంది. మరోవైపు, ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీ-ప్రొడక్షన్‌లో నిమగ్నమై వున్నారు.