సాయుధ మూకల దాడులతో హైతీ ప్రధాని రాజీనామా

సాయుధ మూకల దాడులతో కరేబియన్‌ దేశం హైతీలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి కారణంగా ఆ దేశ ప్రధాన మంత్రి ఏరియెల్‌ హెన్రీ రాజీనామా చేశారు. కరేబియన్ దేశ ప్రభుత్వాధినేత పదవికి హెన్రీ రాజీనామా చేసినట్లు కరేబియన్ కమ్యూనిటీ చైర్ ఇర్ఫాన్ అలీ సోమవారం తెలిపారు. కాగా, హైతీ సాయుధ మూకల దాడులతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. గత నెల కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియెల్‌ హెన్రీ కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టారు. 

దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ ఒ ప్రిన్స్‌ జైలు పైనా వీరు దాడులు చేశారు. జైలును బద్దలు కొట్టారు. వీరి దాడులతో ఆ జైల్లో ఉన్న వందలాది మంది నేరగాళ్లు తప్పించుకుని పారిపోయారు. ఈ పరిణామంతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయంతో వణికిపోతున్నారు. ఇళ్లను వదిలి పారిపోతున్నారు. 

ఇప్పటికే దాదాపు 3,62,000 మంది వలసబాట పట్టారు. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.హైతీ ప్రజలు నిత్యం భయం గుప్పిట ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని, చాలా మంది ఇండ్లలో ఉండి తాళాలు వేసుకుంటున్నారని తెలిపింది. వీధివీధిలో సాయుధ దుండగులే కనిపిస్తున్నారని వెల్లడించింది. 

పలు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లను ఆక్రమించేందుకు క్రిమినల్‌ గ్యాంగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక దవాఖానలు వీరి చేతుల్లోకి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి ఏరియెల్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.