చంద్రబాబు కేటాయించిన భూములకు హైకోర్టులో చుక్కెదురు

* సిబిఐ విచారణకు సూచన

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐఎంజీ భారత్‌ కంపెనీకి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఐఎంజీ భారత్‌కు చంద్రబాబు భూ కేటాయింపులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆ 850 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని కీలక తీర్పును వెలువరించింది. 
 
హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ సమర్ధించింది. చంద్రబాబు హయంలో భారీ భూ కుంభకోణం జరిగిందని ట్వీట్ చేసింది. ‘చంద్రబాబు హయాంలో రూ.50,000 కోట్ల భారీ భూ కుంభకోణం ! 850 ఎకరాల భూములను 2003లో ‘ఐఎంజీ భారత్’ అనే ఒక అనామక కంపెనీకి చంద్రబాబు అప్పజెప్పారు. ఆ కేటాయింపును అప్పటి వైఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దుని సవాల్ చేస్తూ కంపెనీ కోర్టుకెక్కింది. తెలంగాణకు ఆ 850 ఎకరాలను అప్పచెప్పాలని నిన్న హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.’ అని బీఆర్ఎస్ ట్వట్ చేసింది.
 
2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ అనే కంపెనీని రిజిస్టర్ చేయగా, ఆ సంస్థ అధినేతగా అహోబలరావు ఉన్నారు. క్రీడా మైదానాలు కట్టి 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేసిన కంపెనీ నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది. 
 
ఆ సమయంలో సదరు భూమి సుమారు ఎకరం రూ.10 కోట్లు ధర పలుకుతుండగా, ఎకరం రూ.50 వేల చొప్పున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కంపెనీకి భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
అప్పటి నుంచి సుదీర్ఘ వాదోపవాదనలు కొనసాగిన తరువాత వైఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే జస్టిస్ అనిల్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ వ్యవహారంపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా ? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అనంతరం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.