తెలంగాణాలో బిఆర్ఎస్- బిఎస్పి మధ్య పొత్తు

త్వర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంయుక్తంగా ప్రకటించారు.  మంగళవారం హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చలు జరిపారు. 
 
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్‌ పార్టీలు క‌లిసి పోటీ చేయాల‌ని సంయుక్తంగా నిర్ణయించారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు.
 
సిద్ధాంత పరంగా కూడా తాము ఓకే రకంగా ఉన్నామని, దళిత బంధు సహా ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. బీఎస్పీ అధిష్టానం అనుమతితో పొత్తు ప్రస్తావన తెచ్చారని, సీట్లు, విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మాయావతితో రేపు, ఎల్లుండి మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు.

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో లౌకికవాదం ప్రమాదంలో ఉందని, బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లౌకికవాదాన్ని నిరంతరంగా కాపాడిన నేత కేసీఆర్ అంటూ కాంగ్రెస్ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. 

సీట్ల సర్దుబాటు అంశాన్ని అధిష్టానానికి నివేదిస్తామని పేర్కొన్నారు.తెలంగాణలో ఈ స్నేహం ప్రజల జీవితాలను బాగు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, మాయావతితో కూడా మాట్లాడుతారని, అనంతరం సీట్లపై ఒక్క నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులు తొలి జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ నుంచి బి. వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పోటీ చేయనున్నారు. తాజాగా, మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.