ఎన్‌ఐఎకి రామేశ్వరం కేఫ్‌లో పేలుడు

బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ లోని రామేశ్వరం కెఫే పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు హోం శాఖ సోమవారం అప్పగించింది. ఈనెల 1న సంభవించిన ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. అవసరమైతే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు తమ ప్రభుత్వం అప్పగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించిన మరునాడే ఈ కేసును ఎన్‌ఐఎకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 ఇంతవరకు కర్ణాటక పోలీస్‌లు ఎన్‌ఐఎ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్‌ఎస్‌జి), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) సహకారంతో ఈ కేసు దర్యాప్తు సాగించారు. నిందితుడు ఏ మార్గంలో కెఫెలోకి వచ్చాడు, బాంబు అమర్చిన తరువాత ఎలా వెళ్లిపోయాడు అనే అంశంపై పోలీస్ దర్యాప్తు బృందాలు దృష్టి పెట్టాయి.

ఈ కేసులో అనుమానితుడు 9 నిమిషాల పాటు కేఫ్‌లోనే ఉన్నట్లు సిసిటివి ఫుటేజీలో వెల్లడైంది.  సన్‌గ్లాస్‌, మాస్క్‌, బేస్‌బాల్‌ హాట్‌ ధరించిన అనుమానితుడు రామేశ్వరం కేఫ్‌ నుండి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. 

శుక్రవారం ఉదయం 11.43 గంటలకు కేఫ్‌లోకి ప్రవేశించిన అతను ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.  11.43 గంటలకు కేఫ్‌ నుండి బయటకు వెళ్లినట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. మొత్తంగా 9 నిమిషాల పాటు ఆ అనుమానితుడు కేఫ్‌లో ఉన్నట్లు సమాచారం. ఐఇడి (పేలుడు పదార్థాలు)తో ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచినట్లు ఫుటేజీలో కనిపించింది.

అతడు కెఫే సమీపం లోని రూట్ నంబర్ 500 డి బస్సు దిగినట్టు సీసీ కెమేరా దృశ్యాల్లో రికార్డయింది. పేలుడుకు దాదాపు గంట ముందు 12.56 సమయంలో అతడి కదలికలను గుర్తించారు. శనివారమే కెఫే లోని ఉన్న డిజిటల్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఐఇడి సాధనం ద్వారా ఈ పేలుడు జరిగిందని అనుమానిస్తున్నారు. పేలుడుకు సంబంధించి దాదాపు 50 వరకు దృశ్యాలను సేకరించినట్టు కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది.

కాగా, ఈ ఘటనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ), పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, వివిధ కోణాలలో కేసును విచారించేందుకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వరా తెలిపారు. 

 పలు సిసిటివి ఫుటేజీలను కూడా సేకరించామని , వ్యాపార విభేదాలు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరంపై దాడి, తదితర పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.