పొరుగు దేశం పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్కు అభినందనలు’ అని మోదీ తన ట్వీట్లో తెలిపారు.
ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయితే పార్లమెంటులో మెజారిటీని పొందలేకపోయారు. దీంతో షెహబాజ్ షరీఫ్ పార్టీ పాక్లో అధికారం చేపట్టింది.
ఈ క్రమంలోనే పాక్ 24వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ షరీఫ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్ష భవనంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, పీపీపీ చైర్మెన్ బిలావాల్ భుట్టో హాజరయ్యారు.
పీఎంఎల్-ఎన్, పీపీపీ మధ్య అధికారం కోసం డీల్ జరిగిన తర్వాతే ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం చేశారు. కొత్తగా దేశాధ్యక్ష బాధ్యతలను అసిఫ్ అలీ జర్దారి చేపట్టనున్నారు. ఇక షెహబాజ్ గతంలోనూ పాక్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు ఆయన తొలిసారి ప్రధాని బాధ్యతలను నిర్వర్తించారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది