ఓఆర్‌ఆర్ టోల్ టెండర్లపై విచారణ

ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్‌ఎండిఎ అధికారులను ప్రశ్నించారు. 

అందులో ఎవరెవరి ప్రమేయముంది, ఏయే సంస్థలున్నాయి, బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, దస్త్రా లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్‌ఎండిఎ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. 

ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు తప్పిపోయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండిఎ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సిబిఐ కానీ అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో హెచ్‌ఎండిఎ అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్ల్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, కేవలం రూ.7380 కోట్లకు ఐఆర్‌బి కంపెనీకి ఎలా అప్పగించారని ఆరా తీశారు. హెచ్‌ఎండిఎ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

హెచ్‌ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్‌ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు.  టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్‌ఎండిఎ పరిధిని విస్తరించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు.