కాంగ్రెస్ మోసపు హామీలతో మోసపోవద్దు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పార్టీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా సోమవారం గజ్వేల్ పట్టణ కేంద్రంలో మాట్లాడుతూ…తమ పార్టీ రాష్ట్రంలోని 17 సీట్లలో పోటీ చేసి 10కి పైగా పార్లమెంట్ స్థానాలు గెలవాలని భావిస్తోందని తెలిపారు.

జహీరాబాద్, కరీంనగర్, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో యాత్ర కొనసాగుతుందని చెప్పారు. గజ్వేల్‌లో ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని, గెలవగానే లక్ష రూపాయలు అదనంగా భూ బాధితులకు ఇస్తాం, 18 సంవత్సరాల వయసు పైన భూములు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇళ్లకు పట్టాలు ఇస్తాం, ఇళ్లు కట్టిస్తామని ఓట్లు డబ్బాల పడే వరకు హామీలు ఇచ్చి.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు.

కేసిఆర్ ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ ఇవన్నీ వాస్తవ డిమాండ్స్ కాబట్టి వాటిని నెరవేర్చాలని తానే ఈ ప్రభుత్వానికి దరఖాస్తు ఇస్తానని తెలిపారు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటు వేశాం కానీ ఈసారి జెండాలు లేవు మోదీకే వేస్తాం అని జనం చెపుతున్నారని తెలిపారు. దేశంలో సుభిక్షంగా, సురక్షితంగా బతకాలి అనేది మోదీ సంకల్పం అని చెప్పారు. 

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అనేక అక్రమాలు జరిగాయని, 2జి స్పెక్ట్రమ్ స్కాం, కోల్ మైన్ స్కాం, ఫర్టిలైజర్ స్కాం ఇలా అనేక స్కామ్‌లలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు అరెస్టయి జైలులో ఉన్నారని తెలిపారు. ప్రధాని మోదీ హయాంలో ఎక్కడా ఒక్క స్కామ్ కూడా లేదని స్పష్టం చేశారు. 370 ఆర్టికల్ రద్దు, రామాలయ నిర్మాణం, మైనార్టీ మహిళలకు వరమైన ట్రిపుల్ తలాక్ రద్దులాంటి ఎన్నో చారిత్మ్రకమైన నిర్ణయాలు ప్రజలకు తెలియనివి కావని గుర్తు చేశారు. 

సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్‌ను తు.చ తప్పకుండా ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని కొనియాడారు. అందుకే మోదీకి దేశంలో అన్ని వర్గాల,రకాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. బిఆర్‌ఎస్ ఖతమైన పార్టీ అని, ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపిని భారీ మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.