ఐఎన్ఎల్‌డీ చీఫ్ నఫే సింగ్ రాథీ దారుణ హత్య

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్డీ) పార్టీకి చెందిన హర్యానా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బులెట్ల గాయాలైన ఆయన అక్కడికక్కడే మరణించారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. 
 
బహదూర్‌గఢ్‌లోని బరాహి గేట్ సమీపంలో హ్యుందాయ్ ఐ10లో ఉన్న షూటర్లు నఫే సింగ్ ప్రయాణిస్తున్న కారుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో నఫే సింగ్‌తోపాటు ఆ కారులో ఉన్న మరో ఇద్దరు పార్టీ నేతలు మరణించారు. ముగ్గురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగులు సమీపం నుంచి రాథీ, అతని అనుచరులపై కాల్పులకు తెగబడ్డారు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
 
గాయపడిన వారిని వెంటనే వైద్య చికిత్స కోసం సమీపంలోని బ్రహ్మశక్తి సంజీవని ఆస్పత్రికి తరలించగా.. రాథీ అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లు ప్రకటించారు. నఫే సింగ్ రాథీ మరణించినట్లు ఐఎన్‌ఎల్‌డీ మీడియా సెల్ హెడ్ రాకేష్ సిహాగ్ ధృవీకరించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సన్నిహితులు కాలా జాతేడీ ఈ దాడి వెనక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. .
 
కాగా, కాల్పుల సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నఫే సింగ్‌ కారుకు అనేక బుల్లెట్ల రంధ్రాలు ఉండటాన్ని పరిశీలించారు. హంతకులను అరెస్ట్‌ చేసేందుకు పోలీస్‌ బృందాలు ప్రయత్నిస్తున్నాయని పోలీస్‌ అధికారి తెలిపారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
 
నఫే సింగ్ రాథీ హర్యానా అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హర్యానా లెజిస్లేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, దుండగులు పారిపోయేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలపై నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ , ఎస్టీఎఫ్ బృందాలు కేసు దర్యాప్తు ప్రారంభించాయని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని ఝజ్జర్ ఎస్పీ అర్పిత్ జైన్ చెప్పారు.