జ‌గ‌న్ స‌మ‌క్షంలో సొంత గూటికి చేరిన ఎమ్మ‌ల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారాయన. సీఎం జగన్‌ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు. గత డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాల పేరిట వైఎస్సార్‌సీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. 
 
 ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు వై ఎస్ షర్మిల ఎపిసిసి అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత ఆర్కే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. 
 
ఇదిలా ఉంటే సామాజిక సమీకరణాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నియమించడంతో అప్పట్లో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్కే… ఏకంగా వైసీపీకి రాజీనామా చేశారు. . ఈ నేప‌ధ్యంలో తిరిగి పార్టీలోకి వ‌చ్చిన ఆర్కేకు నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను జ‌గ‌న్ అప్పగించారు.
 
‘కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్ ను తిట్టమని ఆదేశించింది. నాకు నచ్చలేదు, జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు. అక్కడ పద్దతీ పాడు ఏమీ లేదు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం అలా లేదు. కేవలం వ్యక్తిగతంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో పాటు పార్టీకి చెప్పి చూశాను కానీ వినలేదు. జగన్ పై వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు నచ్చలేదు అందుకే ఆమెతో నడవడం ఇష్టం లేక సొంత గూటికి వస్తున్నాను’ అని తెలిపారు.
 
2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు నారాలోకేష్‌పై విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డిలో అసంతృప్తి పెరిగినట్టు ప్రచారం జరిగింది. గత ఎన్నికల సమయంలో ఆర్కేను మంత్రి చేస్తామని జగనే స్వయంగా చెప్పారు. కానీ ఆ తర్వాత అది సాధ్యపడలేదు. ఇలా పలు కారణాలతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.