ఆసీస్‌ను వెనక్కినెట్ మళ్లీ రెండో స్థానానికి టీమిండియా

రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. గత వారం న్యూజిలాండ్‌.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టెస్టులు గెలిచి అగ్రస్థానం దక్కించుకోగా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌ రెండో స్థానానికి పడిపోగా భారత్‌ మూడో స్థానానికి పరిమితమైంది. 

కానీ తాజాగా ఇంగ్లండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో ఓడించిన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకింది.  మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మొదట రోహిత్‌ – జడేజాలు సెంచరీలతో కదం తొక్కగా అనంతరం సిరాజ్‌ విజృంభణతో ఇంగ్లండ్‌ ను కట్టడి చేశాడు. 

ఇక రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌ డబుల్‌ సెంచరీకి తోడు గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లు అద్భుతంగా రాణించి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. భారీ ఛేదనలో ఇంగ్లండ్‌ను రవీంద్ర జడేజా మరోసారి తన స్పిన్‌ మాయాజాలంతో ముంచెత్తడంతో బెన్‌ స్టోక్స్‌ సేన అవమానకర ఓటమిని మూటగట్టుకుంది.

ఈ విజయంతో భారత్‌ ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 59.52 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌.. 75 శాతంతో ఉండగా ఆస్ట్రేలియా.. 55 శాతంతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 21.88 శాతంతో ఇంగ్లండ్‌ 8వ స్థానంలో ఉంది.