మూడేళ్లలోనే కూలిపోయే పరిస్థితిలో మేడిగడ్డ

తెలంగాణ నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రధానమైనదని,  ఈ బ్యారేజీ కుంగిపోవడం దురదృష్టకరమని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్ల బ్యారేజీ కుంగిపోయిందని చెబుతూ మూడేళ్లలోనే ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంలో నిమిషం నిడివి గల వీడియోను అసెంబ్లీలో ఉత్తమ్ విడుదల చేశారు. మేడిగడ్డకు ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్వాకం, అవినీతే కారణమని ఉత్తమ్ ఆరోపించారు. రూ. 1,800 కోట్లతో టెండర్లను పిలిచి, అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతూ రూ. 4,500 కోట్లకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. 

గత ఏడాది అక్టోబర్ 21నే మేడిగడ్డ కుంగిపోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఆ అంశంపై కేసీఆర్ మాట్లాడలేదని దుయ్యబట్టారు. డిజైన్, పర్యవేక్షణ లోపం కారణంగానే మేడిగడ్డ ప్రమాదానికి గురైందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన నివేదికలో తెలిపిందని గుర్తు చేశారు.

అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచి లీకేజీ మొదలయిందని ఉత్తమ్ తెలిపారు. ఈ బ్యారేజ్ కూడా కుంగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ అధికారులను పిలిపించామని, ఈ బ్యారేజ్ కు కూడా ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలిపారని చెప్పారు. బ్యారేజ్ లో నీటిని కొంతమేర ఖాళీ చేయాలని సూచించారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా నిరుపయోగమని పేర్కొంటూ ఈ ప్రాజెక్టుకు రూ. 81 వేల కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని, అయితే, రూ. 1.47 కోట్లకు వ్యయం పెరిగిందని చెప్పారు. ఇప్పటి లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 2 లక్షల కోట్లు కావాలని తెలిపారు.  ఎలాంటి సర్వే చేయకుండానే మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించారని, చిన్నపాటి భూప్రకంపన వచ్చినా ఈ ప్రాజెక్టుకు ప్రమాదమేనని కాగ్ హెచ్చరించిందని తెలిపారు. మల్లన్న సాగర్ పరిధిలోని ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని కాగ్ హెచ్చరించిందని చెప్పారు.

గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అంటూ బీఆర్ఎస్ హయాంలో జల దోపీడీ జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నప్పటికీ మాట్లాడలేదని, ఫలితంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు.

రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఏపీ సర్కార్ నీళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదని, ఎన్నికల వేళ నార్లాపూర్ వద్ద కేవలం ఒక్క మోటర్ ను మాత్రమే నడిపించారని గుర్తు చేశారు. కృష్ణా జలాల నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కృష్ణా జలాల్లో ఉండే వాటా విషయంలో కూడా నాటి సర్కార్ పోరాటం చేయలేదని ధ్వజమెత్తారు.