ఫలించని కేంద్రం చర్చలు.. ఆదివారం మరోసారి చర్చలు

వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా తమ 20 డిమాండ్ల పరిష్కారం కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఢిల్లీ ఛలో ఆందోళనలు నాలుగో రోజుకు చేరాయి. రెండు రోజుల పాటు అట్టుడికిన పంజాబ్‌, హరియాణా సరిహద్దులు గురువారం కాస్త శాంతించాయి. అయితే, రైతు సంఘాలు గురువారం రైల్‌రోకో చేపట్టడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
శుక్రవారం గ్రామీణ భారత్‌ బంద్‌‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు, మూడో దఫా రైతు సంఘాల నేతలు, కేంద్రం మధ్య గురువారం సాయంత్రం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చండీగఢ్‌‌లో జరిగిన ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి  భగవంత్‌ మాన్‌, ఆర్థిక మంత్రి హరిపాల్ చీమా, రైతు సంఘాల నేతలు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌, శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ పాల్గొన్నారు.
 
కానీ, చర్చల్లో ఎటువంటి అంగీకారం కుదరలేదు. దీంతో ఆదివారం మరోసారి చర్చలు జరపనున్నట్టు కేంద్ర మంత్రులు గురువారం రాత్రి వెల్లడించారు. అయితే, ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ‘రైతు సంఘం లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించి, తదుపరి సమావేశం ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరపాలని మేము నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పారు. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు ఆయన తెలిపారు.
చర్చలు ఫలించకపోయినా కేంద్రం, రైతులు కొంతమేరకు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకు వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేసినా, శాంతియుతంగా కొనసాగించేందుకు రైతులు అంగీకరించారు.  విశ్వసనీయ వర్గాల కధనం మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే విషయంలోనే చర్చలలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తున్నది.
ఈ విషయమై రైతు నాయకులు మొండిగా వ్యవహరిస్తుండగా, వెంటనే ఆ మేరకు చట్టం తీసుకు రావడం కుదరదని, తొలుత నిపుణుల కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. పైగా ప్రస్తుత పార్లమెంట్ చివరి సమావేశాలు కూడా గతవారం ముగిసిపోవడంతో ఎన్నికలయి, కొత్త పార్లమెంట్ ఏర్పడితే గాని కొత్తగా చట్టం తీసుకు రావడం కుదరదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

చర్చలు ఫలించకపోవడంతో ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. శంభు, ఖనౌరీల వద్ద వేల మంది రైతులు, పోలీసులు మోహరించి ఉన్నారు. తాము బారికేడ్లను తొలగించేందుకు గురువారం ఎటువంటి ప్రయత్నం చేయలేదని రైతు నేతలు తెలిపారు. అటు, సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు శుక్రవారం నాడు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దేశ నలుమూలల్లోని రైతులు ఈ భారత్ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.