కాళేశ్వరంలో ప్రయోజనం లేకపోయిన భారీ వ్యయం

కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ఎక్కువ ప్రయోజనం లేకుంగా పోయిందని కాగ్ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.  డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని, ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదిక పేర్కొంది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని కాగ్ నివేదిక పేర్కొంది. 
 
 మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని,ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చు లు తక్కువ చూపారని వెల్లడించింది. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని.. ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నట్లు కాగ్ రిపోర్టులో పేర్కొంది.
 
15 బ్యాంకులతో రూ. 87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారని… బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని తెలిపింది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసిందని పేర్కొంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం రూ.700 కోట్ల నుంచి 14 వేల 5 వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని, రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వెల్లడించింది. 
 
కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036 లో పూర్తవుతుందని అంటూ కాగ్ నివేదికలో పేర్కొంది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3555 అదనపు వ్యయం పెరిగిందని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకమయ్యాయని వివరించారు. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని, పనుల అప్పగింతలో నీటి పారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని కాగ్ మండిపడింది. 
 
డిపిఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని, డిపిఆర్ ఆమోదం తరువాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని, అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టిఎంసి పనులు చేపట్టారని, అదనపు టిఎం సి వల్ల రూ.25 వేల కోట్ల అదనపు వ్యయం గుర్తించామని కాగ్ ప్రకటించింది.
 
 సాగునీటి మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుందని, ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1:51గా అంచనా వేశామని, ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పతి 0.75గా తేలుతోందని, మరింత తగ్గే అవకాశం ఉందని, లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ తప్పుపట్టింది.
ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నుంచి రీఇంజినీరింగ్ అవసరం, చేసిన మార్పులు, రీఇంజినీరింగ్ విధానం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, పనులు, అంచనా వ్యయం, ఎకనామిక్ వయబిలిటీ, అనుమతులు, ఆర్థికవనరుల సమీకరణపై కాగ్ అడిట్ నిర్వహించింది. పనుల పురోగతి, భూసేకరణ, సహాయ – పునరావాసం, డిజైన్ల ఖరారు, ఒప్పందాలు, పర్యావరణ నిర్వహణా ప్రణాళిక, అంచనాల తయారీ, వృధా ఖర్చు, టెండర్ విధానం, చెల్లింపులపై కూడా ఆడిట్ నిర్వహించారు.