శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ ప్రారంభించిన ముగ్గురు ప్రధానులు

యూపీఐ సేవలు శ్రీలంక, మారిషస్‌ దేశాల్లో ప్రారంభమయ్యాయి. భారత, శ్రీలంక, మారిషస్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, రణిల్‌ విక్రమసింఘే, ప్రవింద్‌ జుగ్నాథ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రారంభించారు. గత ఏడాది జూలైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత పర్యటన సందర్భంగా శ్రీలంకలో యూపీఐ సేవలకు సంబంధించి ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో రెండు దేశాల్లో యూపీఐ సేవలను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మూడు దేశాలకు ఇది ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. నేడు మనం మన చారిత్రక సంబంధాలను ఆధునిక డిజిటల్ మార్గంలో అనుసంధానిస్తున్నామని ప్రజలకిచ్చిన అభివృద్ధి వాగ్ధానాలకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. 
 
ఫిన్‌టెక్ కనెక్టివిటీ క్రాస్ బోర్డర్ లావాదేవీల్లో సహాయం చేయడమే కాకుండా సరిహద్దుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో పెద్ద మార్పును తీసుకువచ్చిందని. పల్లెల్లో చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని, ఇందులో సౌలభ్యంతో పాటు వేగం కూడా ఉంటుందని చెప్పారు. ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ అనేది భారతదేశ విధానమని పేర్కొన్నారు.
 
 మారిషస్‌లో యూపీఐ సేవల ప్రారంభంపై ఆ దేశ ప్రధాని ప్రవింద్‌ జుగ్నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. రూపేకార్డ్‌ను జాతీయ చెల్లింపుల స్విచ్‌తో కోబ్రాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. మారిషస్‌లో దేశీయ కార్డ్‌గా పరిగణించబడుతుందని తెలిపారు. భారత్‌- మారిషస్ సాంస్కృతిక, వాణిజ్యంతో సంబంధాలను పంచుకుంటున్నాయని గుర్తు చేస్తూ  ఇది శతాబ్దాలుగా ఉందని.. దాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్నామని చెప్పారు. 
 
శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానికి అభినందనలు తెలిపారు. యూపీఐ సేవల ప్రారంభంతో రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. వేల సంవత్సరాల నుంచి రెండు దేశాల మధ్య చెల్లింపులు జరుగుతున్నాయని అయితే అప్పట్లో సెంట్రల్ బ్యాంక్ లేదని పేర్కొన్నారు. నేడు మనం టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెబుతూ భారతీయ పర్యాటకులు శ్రీలంకను సందర్శిస్తున్నందున యూపీఐని ఉపయోగించవచ్చని తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ నెల 2న యూపీఐ సేవలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఐకానిక్‌ ఈఫిల్‌ టవర్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారత పర్యటన సందర్భంలో జైపూర్‌లో యూపీఐ చెల్లింపులు చేశారు. సింగపూర్, యూఏఈతో సహా ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో భారతదేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్ (యూపీఐ) ముఖ్యమైన పోషిస్తున్నది.