టీఎంసీ రాజ్యసభ అభ్యర్థిగా మహిళా జర్నలిస్ట్

రాజ్యసభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌  పార్టీ నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో మహిళా జర్నలిస్టు సాగరిక ఘోష్‌, టీఎంసీ నాయకులు సుస్మితా దేవ్‌, మహ్మద్‌ నదీముల్‌ హక్‌, మమతా ఠాకూర్‌ ఉన్నారు. ఈ విషయాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

‘రాజ్యసభ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులుగా సాగరిక ఘోష్‌, సుస్మితా దేవ్‌, మహ్మద్‌ నదీముల్‌ హక్‌, మమతా ఠాకూర్‌ పేర్లను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వారందరికీ శుభాకాంక్షలు. తృణమూల్ కాంగ్రెస్‌ నామినేట్‌ చేసిన వీరంతా భారతీయుల హక్కుల కోసం వాదించే మా పార్టీ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం’ ఎక్స్‌లో టీఎంసీ పేర్కొంది. ఈ ట్వీట్‌ను సాగరిక ఘోష్‌ రీట్వీట్‌ చేశారు.

రెండు సార్లు రాజ్యసభ ఎంపి అయిన నదీముల్ హక్ తిరిగి పోటీ చేస్తుండగా, ముగ్గురు సిట్టింగ్ ఎంపిలు సుభాసీశ్ చక్రవర్తి, అబీర్ బిశ్వాస్, శంతను సేన్‌లను తిరిగి నామినేట్ చేయరాదన్న నిర్ణయం పార్టీ వ్యూహంలో గణనీయమైన మార్పును సూచిస్తున్నది. కాగా, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ఇంకా అధికారికంగా టిఎంసిలో చేరలేదు.

కాగా, సాగరిక ఘోష్‌ ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సతీమణి ది టైమ్స్ ఆఫ్ ఇండియా, అవుట్ లుక్ మ్యాగజైన్, సీఎన్ఎన్-ఐబీఎన్ (ప్రస్తుతం సీఎన్న్-న్యూస్ 18) వంటి పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రింట్ జర్నలిజంతో పాటు టీవీ యాంకర్‌గా, పొలిటికల్ కామెంటరేటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. 

ది జిన్ డ్రింకర్స్, బ్లెయిండ్ ఫెయిత్: ఇండియా అండ్ ది మిరేజ్ ఆఫ్ అర్బన్ మోడ్రనిటీ, వై ఐ యామ్ ఎ లిబరల్’ తదితరల పుస్తకాలను రచించారు. టీఎంసీ, మమతా బెనర్జీతో సన్నిహత సంబంధాలు ఉన్నాయి. దివంగత మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే అయిన సుస్మితా దేవ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. గతంలో అసోంలోని సిల్చార్ నుచి లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. 

ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత రాజ్‌దీప్ రాయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీలో చేరడానికి ముందు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. కాగా, నదీముల్ హఖ్‌కు టీఎంసీకి చెందిన ప్రముఖ ముస్లిం నేతగా పేరుంది. ప్రస్తుతం పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఎంసీలో మరో ప్రముఖ నేత మమత బాల ఠాకూర్. గతంలో బనగావ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

బెంగాల్ అసెంబ్లీలో పార్టీల బలాబలాల దృష్టా టిఎంసి నాలుగు స్థానాలను, బిజెపి ఒక స్థానాన్ని పొందగలవు. 294 మంది సభ్యులు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 217మంది సభ్యులతో టిఎంసి నాలుగు స్థానాలను సునాయాసంగా దక్కించుకోగలదు. బిజెపి నుంచి ఫిరాయించిన ఆరుగురు ఎంఎల్‌ఎల మద్దతు కూడా టిఎంసికి ఉన్నది. ఇక అసెంబ్లీలో బిజెపి బలం అధికారికంగా 74. కాని ఫిరాయింపుల వల్ల అనధికారికంగా పార్టీ బలం 68కి తగ్గింది.