న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా తొలిసారి భారతీయుడు

అమెరికాలోని న్యూయార్క్‌ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్‌ జయేశ్‌ బల్సారా (46) నియమితులయ్యారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వర్గాలు ప్రకటించాయి. బల్సారా ప్రస్తుతం అదే కోర్టు మేజిస్ట్రేటుగా పనిచేస్తున్నారు. 2017 నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. 
 
దీంతో ఈ పదవిని చేపట్టిన మొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్‌ కోర్టులో పనిచేస్తున్న సంకేత్‌  సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. 
 
సంకేత్‌ న్యూ రోషెల్‌లో జన్మించారు. అతని తండ్రి  ఆయన తండ్రి న్యూయార్క్‌ మున్సిపాలిటీలో ఇంజినీరుగా పనిచేశారు. తల్లి నర్సుగా పనిచేస్తున్నారు. సంకేత్‌ 2002లో హార్వర్డ్‌ లా స్కూల్‌ నుండి జేడీ, 1998లో హార్వర్డ్‌ కళాశాల నుండి ఏబీ పట్టా పొందారు. ప్రస్తుతం సంకేత్‌ తన భార్య క్రిస్టీన్‌ డెలోరెంజోతోపాటు లాంగ్‌ ఐలాండ్‌ సిటీలో నివాసముంటున్నారు.