ఆరు గ్యారంటీలకు బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయిస్తారు?

గురువారం నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  6 గ్యారంటీ ల అమలుకు కార్యాచరణ ప్రణాళికను బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు.  6 గ్యారెంటీ ల పేరుతో ఇచ్చిన అనేక హామీల అమలుకు లబ్ది దారులు ఎంత మంది అవుతున్నారు? ఎంత ఖర్చు అవుతుంది?  ఈ బడ్జెట్ లో ఎంత డబ్బు కేటాయిస్తున్నారో  అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించాలని ఆమె స్పష్టం చేశారు. 

6 గ్యారెంటీ ల అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని అంటూ కొత్త ఆదాయ మార్గాలు సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపోతం చేస్తారా? అప్పుల రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అలవి కానీ హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిన మీరు మళ్లీ అప్పులు చేసి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా? ప్రజల పైన పన్నులు వేసి ఆ డబ్బునే 6 గ్యారెంటీ ల పేరు తో ప్రజలకు పంచుతారా? చెప్పాలని ఆమె నిలదీశారు.

వెంటనే అమలు చేయాల్సిన పెన్షన్ లాంటి స్కీములు 61 రోజులైనా అమలు కావడం లేదని, యాసంగి పంట కోత కు వచ్చే సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా వూసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమె ధ్వజమెత్తారు.

కృష్ణా జలాల పంపిణీ పై సవాల్ చేస్తూ బడ్జెట్ సెషన్ ను పక్క దారి పట్టించాలనుకుంటున్న రేవంత్ రెడ్డి కృష్ణా నది పై జూరాల నుండి నాగార్జున సాగర్ దాకా ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎస్ఎల్బిసి, దిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తారో? ఎప్పటిలోగా పూర్తి చేస్తారో? ఒక ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ప్రకటించాలని రాణి రుద్రమ కోరారు.

డిసెంబర్ 9న చేస్తానన్న 2 లక్షల రైతు రుణ మాఫీ విషయంలో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నైనా నిధులు కేటాయించి వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మానిఫెస్టో లోనే హామీల అమలు తేదీలను ప్రకటించిన పార్టీ కి అధికారంలోకి వచ్చాక ఆ తేదీలు ఎందుకు గుర్తు రావడం లేదని అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారెంటీ ల అమలుకు కార్యాచరణ ప్రకటించక పోతే గత పదేళ్లుగా రూ. 9 లక్షల కోట్లు తెలంగాణ కుకేటాయించి అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజల పక్షాన గ్యారెంటీల పేరుతో గారడీ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పైన పోరాటం చేస్తుందని రాణి రుద్రమ హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చి అలవికాని హామీలిచ్చారని ఆమె విమర్శించారు.  ఆరు గ్యారంటీల పేరుతో గారడీ చేసి తెలంగాణ ప్రజలను మాయలో నెట్టేశారని ఆమె మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చి 61 రోజులు గడిచిందని, 100 రోజుల్లో నెవరేరుస్తామన్న హామీల కథ కంచికే పోయింది తప్పితే అమలయ్యే పరిస్థితి కనబడటం లేదని ఆమె ధ్వజమెత్తారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఇస్తామన్నారని,  రూ. 500 గ్యాస్ సిలిండర్ అన్నరని, కానీ దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయిహింపుల  గురించి ఎందుకు చెప్పడం లేదు? అంటూ ఆమె నిలదీశారు. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్నరని చెబుతూ
యాసంగి పంట నాట్లు పూర్తయి, పంట కోతలు కూడా దగ్గరపడ్డయి. కాని, ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు.

రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు నెరవేర్చలేదని ఆమె చెప్పారు.  గృహలక్ష్మి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు.  అయితే,  గత పదేళ్ల దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎవ్వరికీ ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ఎలా అమలు చేస్తుంది? అంటూ నిలదీశారు.

ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఎప్పుడు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఎంతమంది? ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలను ఎట్లా ఆదుకుంటరు? గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో తప్పిదాలేంటి? సమాధానం చెప్పాలని రాణి రుద్రమ ముఖ్యమంత్రిని నిలదీశారు.