ఉపాధికి ఊత‌మిచ్చే బ‌డ్జెట్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ 2024-25 ఆశాజ‌న‌కంగా ఉంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కితాబిచ్చారు. కేంద్ర బ‌డ్జెట్ మెరుగ్గా ఉంద‌ని స్వాగ‌తిస్తూ ఎన్నో ఉపాధి అవ‌కాశాల‌కు ఇది ఊత‌మిస్తుంద‌ని స్వాగ‌తించారు. వృద్ధి ఆధారిత బ‌డ్జెట్ అని వ్యాఖ్యానించారు.

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ప్రధాని తెలిపారు.  వికసిత్ భారత్‌కు మూలస్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అని కొనియాడారు. 

ద్రవ్యలోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు. ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా యువతకు ఎన్నో కొత్త కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తాయని మోదీ పేర్కొన్నారు.

యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ఈ దిశగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందని వివరించారు. పేదలు, మధ్య తరగతి సాధికారికతకు దోహదపడుతూ, వారిలో నూతన ఉపాధి అవకాశాలను ఏర్పర్చుతుందని చెప్పారు. పేదలకు మరో 2 కోట్ల గృహనిర్మాణాలు బడ్జెట్ ప్రతిపాదించిందని గుర్తు చేశారు.