పసుపు రైతులకు గిట్టుబాటు ధరకు ట్రేడర్స్ సంసిద్ధంగా ఉండాలి

పసుపు రైతుల కు గిట్టుబాటు ధర కల్పించేందుకు డీలర్లు, కొనుగోలుదారులు సంసిద్ధంగా ఉండాలనీ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారిలతో కలిసి నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో పసుపు ట్రేడర్స్, అమ్మకం కొను గోలుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

పసుపు రైతులు పసుపుని పూర్తిగా ఎండబెట్టిన తర్వాతనే మార్కెట్ యార్డ్ కి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని జిల్లాకు పసుపు బోర్డు తేవడం తన అదృష్టంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పసుపు పండించే రైతన్నలకు గతంలో కంటే ఈ సంవత్సరం నుండి గిట్టుబాటు ధర సుమారు రూ.14వేల వరకు ధర రావడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. 

రైతన్నలు కూడా పంటను కృత్రిమంగా పండిస్తూ నాణ్యమైన పంట పండించే విధంగా మందుల వాడకం తగ్గించాలని చెబుతూ తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. పండించే పంట ఇతర జిల్లాలకు వెళ్లకుండా డిస్ట్రిబ్యూటర్లు, కొనుగోలుదారులు జిల్లాలోని కొనుగోలు అయ్యేటట్లు రైతులకు సహకరించాలని సూచించారు.

ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా రైతన్నలు పండించిన పంటను ఎండించి శుభ్రపరిచి మార్కెట్ లోని కొనుగోలుదారులకు అమ్మకాలు జరిపి మద్దతు ధర పొందాలని చెప్పారు. ఈ సంవత్సరమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా పసుపుకు రూ.20వేల గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని హామీ ఇచ్చారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. పసుపు ఎగుమతిపై కేంద్రం, ప్రధాని మోడ్  ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.