నాలుగు పదుల వయసులో గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్లో సరికొత్త చరిత్ర లిఖించాడు. 43 ఏండ్ల బోపన్న.. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఈ ఏడాది మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు.
మెల్బోర్న్లోని రాడ్లీవర్ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్స్లో రోహన్ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5 తేడాతో సిమోన్ బొలెలి – ఆండ్రియా వవస్సోరి (ఇటలీ)పై గెలిచి టైటిల్ నెగ్గింది. బోపన్నకు తన సుదీర్ఘ కెరీర్లో ఇదే తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం.
హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో ఇటలీ జోడీ నుంచి బోపన్న జంట తీవ్ర పోటీని ఎదుర్కొంది. తొలి పాయింట్ నుంచి ఇరు జోడీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. టై బ్రేక్కు దారి తీసిన తొలి సెట్ను సొంతం చేసుకున్న బోపన్న జోడీ.. రెండో సెట్లో కాస్త తడబడింది.
ఓ దశలో రోహన్ జోడీ 3-4తో వెనకబడినా పుంజుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్కు దారితీస్తుందా? అనిపించింది. కానీ రోహిన్-ఎబ్డెన్ అద్భుతంగా పుంజుకొని రెండో సెట్ను 7-5తో సొంతం చేసుకొని విజేతగా నిలిచింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నకు పద్మ పురస్కారం ప్రకటించింది.
భారత్ తరఫున మెన్స్ డబుల్స్ విభాగంలో 2012లో లియాండర్ పేస్ తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా బోపన్న రికార్డులకెక్కాడు. ఈ విజయం ద్వారా బోపన్న టెన్నిస్లో పలు ఘనతలు అందుకున్నాడు. 43 ఏండ్ల వయసులో మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న టెన్నిస్ ఓపెన్ ఎరాలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు.
టెన్నిస్ చరిత్రలో ఇప్పటివరకూ అమెరికా టెన్నిస్ ప్లేయర్ మైక్ బ్రియాన్ (41 ఏండ్ల 76 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది. ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గే రోజుకు బోపన్న వయసు 43 ఏండ్ల 329 రోజులు. బోపన్నకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కాగా విజేతగా నిలిచింది మాత్రం ఆస్ట్రేలియా ఓపెన్ – 2024లోనే కావడం విశేషం.
2010లో బోపన్న పాకిస్తాన్ ఆటగాడు ఐసమ్ ఉల్ హక్ ఖురేసితో కలిసి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరాడు. గతేడాది బోపన్న – ఎబ్డెన్ల ద్వయం యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడింది. కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ను గెలిచిన రోహన్ బోపన్న 2017లో మిక్స్డ్ డబుల్స్లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఈ విజయం ద్వారా బోపన్న మెన్స్ డబుల్స్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం విశేషం. భారత్ నుంచి ఈ ఘనత అందుకున్నవారిలో బోపన్న నాలుగో ఆటగాడు.
భారత్ తరఫున మెన్స్ డబుల్స్ విభాగంలో 2012లో లియాండర్ పేస్ తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా బోపన్న రికార్డులకెక్కాడు. గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీరజాలు ఈ ఘనత అందుకున్నారు. డబుల్స్ విభాగంలో బోపన్న సుమారు 60 సార్లు గ్రాండ్స్లామ్స్ టోర్నీలో పోటీ పడగా తొలిసారి అతనికి విజయం దక్కింది.
More Stories
చంద్రయాన్-5 మిషన్కు కేంద్రం ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు