కేరళలో ఆన్‌లైన్ కుంభకోణం.. రూ 1157 కోట్లు వసూలు

పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. `హెచ్ఆర్ కాయిన్’ ల ద్వారా రూ 1157 కోట్లు ప్రజల నుండి వసూలు చేసారని గుర్తించారు.

హైరిచ్ ఆన్‌లైన్ షాప్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కేడీ ప్రతాపన్, శ్రీనా ప్రతాపన్‌లు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ఈ దంపతులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు వారి ఇళ్లు, ఆఫీసుల్లో జనవరి 23, 24 తేదీల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 
 
దంపతుల పేరు మీద ఏకంగా 55 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, వాటిల్లో అక్షరాల రూ.212 కోట్లు ఉన్నట్లు తేలింది. ఆ సొమ్మంతా ప్రజల నుంచి మోసపూరితంగా వసూలు చేసినవిగా గుర్తించారు. అధిక రాబడులు ఇస్తామని చెప్పి డిపాజిట్లు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ (బడ్స్) చట్టం కింద కేసు నమోదు చేశారు.
 
ఇటీవల కాలంలో అత్యధికంగా క్రిప్టో మార్పిడి ద్వారా నల్లధనం చలామణి చేశారని కనుగొన్నారు. ఐదు కంపెనీల ద్వారా ఈ  లావాదేవీలు జరిగిన్నట్లు పేర్కొంటూ భారీ మొత్తాలను విదేశాలకు తరలించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ సాదాల ముందే తప్పించుకున్న అసలు సూత్రధారులు కేడీ ప్రతాపన్, శ్రీనా ప్రతాపన్‌ ఇంకా పట్టుబడలేదు.
 
ఈ చట్టం ప్రకారం వారి స్థిర, చరాస్తులను జప్తు చేయాలని త్రిసూర్ కలెక్టర్ ఆదేశించారు. 40% రిటర్న్‌లు ఇస్తామని చెప్పి సేకరించిన డబ్బును నాలుగు ప్రైవేట్‌ బ్యాంకుల్లోని 20 ఖాతాల్లో జమ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. హైరిచ్ దాదాపు 70 షెల్ కంపెనీలను కలిగి ఉందని, వాటిలో 14 త్రిస్సూర్‌లో ఉన్నట్లు వివరించారు. 
 
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ముందస్తు బెయిల్‌ను కోరుతూ ప్రతాపన్‌ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జనవరి 25న విచారించాల్సి ఉండగా న్యాయమూర్తి నివేదిక కోరడంతో, విచారణను జనవరి 30కి వాయిదా వేసినట్లు ఈడీ  స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోష్ తెలిపారు.