
ప్రముఖ సినీ నటి మీనా బీజేపీలో చేరనున్నారా? అందుకే ఆమెకు బీజేపీ అధిష్ఠానం తగిన ప్రాధాన్యం ఇస్తోందా? పైగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా ప్రముఖ నటుడు కమలహాసన్ పోటీ చేసేందుగా ఆమె సిద్దపడుతున్నారా? ఈ విషయమై తమిళనాడు రాజకీయ వర్గాలలో సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇందులో భాగంగానే ఇటీవల తమిళనాడుకు చెందిన కేంద్ర సమాచార, మత్స్య అభివృద్ధి, పశు సంవర్థక శాఖ మంత్రి ఎల్.మురుగన్ ఢిల్లీలో తన అధికార నివాసగృహంలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాకు ఆహ్వానం అందిందని, అక్కడ కూడా ఆమెకు బిజెపి వర్గాలు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో ఆది నుంచి సినీ ప్రముఖులదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న స్టాలిన్ సైతం సినీ రంగం నుంచి వచ్చినవారే.
అందుకే రాష్ట్ర రాజకీయాల్లో సినీవర్గాలకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంది. కానీ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సినీ ప్రముఖుల సందడి తగ్గినట్లు కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం సినీ ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ప్రముఖ నటి ఖుష్బూ ఆ పార్టీలో కీలక నేతగా ఉండటమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఇంట్లో జరిగిన పొంగల్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో సినీ నటి మీనా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అంతేగాక ఆమెను మురుగన్ పలువురు అగ్రనేతలకు పరిచయం చేయడం కనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రం నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ప్రధాని మోదీతో కలిసి పొంగల్ తయారీలోనూ ఆమె పాల్గొన్నారు.
ఆమె బీజేపీలో చేరనున్నారని, అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎల్. మురుగన్ ఉన్నప్పుడు పలువురు సినీ ప్రముఖులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనే మీనాను పార్టీలో చేర్పించేందుకు సన్నాహాలు చేశారని తెలుస్తోంది. ఇందుకు మీనా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
‘ఇండియా’ కూటమిలో చేరనున్న ‘మక్కల్ నీదిమయ్యం’ అధినేత, సీనియర్ నటుడు కమలహాసన్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ చెన్నై నుంచి పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు పోటీగా మీనాను బరిలోకి దింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది.
కమల్పై మీనా పోటీ చేస్తేనే అక్కడ గట్టిపోటీ ఇచ్చే అవకాశముందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు దక్షిణ చెన్నైలో బీజేపీకి కొంతమేరకు పట్టుంది. అందుకే ఇక్కడి నుంచి మీనాను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారని, ఇందుకు ఆమె కూడా చూచాయగా సరేనన్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే మీనా కుటుంబీకులు మాత్రం ఈ వ్యవహారాన్ని కొట్టి పారేస్తున్నారు. పొంగల్ వేడుకలకు ఆహ్వానం అందితేనే మీనా ఢిల్లీ వెళ్లారని, పార్టీలో చేరికకు సంబంధించి తమకెలాంటి సమాచారం లేదని వారు పేర్కొంటున్నారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి