పొగమంచుతో 53 విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు

ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల్లో లాగే ఇవాళ ఉదయం కూడా అక్కడ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట బయటికి వచ్చిన చలికి గజగజ వణుకుతున్నారు.
 
మరోవంక, దేశ రాజ‌ధాని ఢిల్లీలో పొగ‌మంచు ద‌ట్టంగా క‌మ్ముకుంది. పొగ‌మంచు కార‌ణంగా విమానాల రాక‌పోక‌ల‌కు తీవ్రం అంతరాయం క‌లుగుతోంది. దాదాపు 120 విమానాల రాక‌పోక‌ల‌పై పొగ‌మంచు ప్ర‌భావం చూపుతోంది. ఈ క్ర‌మంలో 53 విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు. విమానాలు ఆల‌స్యంగా రాక‌పోక‌లు కొన‌సాగిస్తుండ‌టంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పొగ‌మంచు కార‌ణంగా విజిబిలిటీ కూడా ప‌డిపోయింది. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాల రాక‌పోక‌లు నెమ్మదిగా కొన‌సాగుతున్నాయి. పొగ‌మంచు, చ‌లి తీవ్ర‌త కార‌ణంగా ఐఎండీ అధికారులు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పంజాబ్, హ‌ర్యానాకు రెడ్ అల‌ర్ట్ జారీ చేసిన‌ట్లు పేర్కొన్నారు.ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుని చలి కాగుతున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్‌ షెల్టర్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ఉండే పలువురు రాత్రి వేళల్లో ఆ నైట్‌ షెల్టర్‌లలో తలదాచుకుంటున్నారు. 

చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది. దాంతో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిలో పలు రైళ్లు కూడా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.

గురువారం ఢిల్లీలో 4.8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. జైపూర్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం ఫ‌తేపూర్‌లో అత్య‌ల్పంగా 2.9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, సంగ్రియాలో 3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. శ్రీగంగాన‌గ‌ర్‌లో 4.3, అల్వార్‌లో 4.5, శిక‌ర్‌లో 5, పిలానిలో 5.1, చురూలో 5.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.