చంద్రబాబు పచ్చి మోసగాడు, జగన్ వెంటే నా ప్రయాణం

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మోసగాడని ప్రంపంచం మొత్తానికి తెలుసు కానీ ఇంత పచ్చి మోసగాడని, దగా చేస్తాడని, కుటుంబాల మధ్య చిచ్చు పెడతాడని తెలియదంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ తనకు సీటు ఇవ్వరాదని నిర్ణయించినట్టు పార్టీ స్పష్టం చేయడంతో పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి తన దారి తాను తీసుకోబోతున్నట్లు ప్రకటించిన నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
 
ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని వచ్చే ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా పోటీచేయబోతున్నట్లు సంకేతం ఇస్తూ తన రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. జగన్ ను ప్రజా పక్షపాతిగా అభివర్ణిస్తూ ఇప్పుడు జగన్‌తో ప్రయాణం చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
 
టీడీపీ కోసం, ప్రజల కోసం చాలా నిజాయితీగా కష్టపడ్డానని, తన సొంత వ్యాపారాల కంటే.. పార్టీనే ముఖ్యమని అనుకున్నట్టు వివరించారు. పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలు కూడా వదిలేశానని పేర్కొంటూ తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రెండు వేల కోట్లుగా తెలిపారు. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజాల మీద మోసినట్టు చెప్పుకొచ్చారు. 
 
పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునితో ప్రెస్ మీట్ పెట్టించి తనను తిట్టించారని,  గొట్టం గాడు అన్న భరించానని,  చెప్పుతొ కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి అన్నా.. తనను ఎవరు ఎన్ని మాటలు అన్నా పార్టీ నుంచి మాత్రం ఎలాంటి మద్దతు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
తన విషయంలో టీడీపీ ప్రోటోకాల్ విస్మరించిందని ఆరోపించారు. ఎంపీగా తాను సీఎం కార్యక్రమాలకు హాజరు కావాలని, కానీ తనను చంద్రబాబు హాజరుకానివ్వలేదని చెప్పుకొచ్చారు. చివరకు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టి, ఖర్చుల భారం అంతా తనపై వేసి, చంద్రబాబు ప్రచారానికి వచ్చిన్నప్పుడు స్థానిక ఎంపీగా తనను పాల్గొనవద్దని కోరారని గుర్తు చేశారు.
 
తనను తన కుటుంబ సభ్యులతోనే కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశారని కేశినేని ప్రశ్నించారు. తాను పార్టీలో ఉండటం ఇష్టంలేదంటే చెప్పండి వెళ్లిపోతా అని ఆరోజే చంద్రబాబును అడిగానని.. కానీ నువ్వు ఉండాల్సిందే అని చెప్పినట్టుగా పేర్కొన్నారు.  పాజహాన్ తాజ్ మహల్ కట్టాడు.. తాను అమరావతి కట్టాను అని చంద్రబాబు చెప్పుకుంటారని, కానీ విజయవాడ రియాలిటీ.. అమరావతి ఓ కల అంటూ నాని ఎద్దేవా చేశారు. 
 
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ కాబోతోందని స్పష్టం చేశారు. తాను అప్పట్లో చంద్రబాబును టికెట్ అడగలేదని,  ఇప్పుడు జగన్‌ను కూడా టికెట్ అడగనని, అయితే జగన్ ఏం చేయమంటే అది చేస్తానని కేశినేని నాని తెలిపారు.