మేడిగడ్డ కుంగుబాటుపై న్యాయవిచారణకు హైకోర్టుకు లేఖ

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషియల్ విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషియల్ విచారణ నిర్వహిస్తామని తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ మేరకు ఇవాళ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 12 చోట్ల విజిలెన్స్ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఇరిగేషన్ కార్యాలయంలో ఇటీవల కీలకమైన కంప్యూటర్లు, ఫైల్స్ మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ సోదాలు, జ్యుడీషియల్ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా ఎవరు వ్యవహరించారనే దానిపై గుర్తించాలని ప్రభుత్వం భావిస్తుంది. 

ఈ ప్రాజెక్టుకు టెండర్ ను ఎలా ఫైనల్ చేశారు? ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. విజిలెన్స్ నివేదిక, జ్యుడీషియల్ విచారణ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏం జరిగిందనే అంశాలను బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని  భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరోవంక,  కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించామని, కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. 

మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌ను ఆదేశించామని మంత్రి డి తెలిపారు. మొత్తం 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు.. ఇతర అంశాలను తేల్చాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలిపారు.