ఫార్ములా ఈ రేస్ కు నిధుల విడుదలపై ఐఏఎస్ కు మెమో

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై వారంలోగా వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్‌ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మెమో జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖతో పాటు హెచ్‌ఎండిఏ సంస్థకు కమిషనర్‌తో పాటు పలు కీలక శాఖల్లో పనిచేశారు.

హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా మూడేళ్ల పైచిలుకు పనిచేసిన సమయంలో పలు అభివృద్ధి పనుల్లో అవకతవకలకు జరిగినట్టు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన హయాంలో పలు పార్కుల అభివృద్ధితో పాటు ప్లై ఓవర్‌లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్‌ఎండిఏ నిధులను కేటాయించింది. దీంతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డు లీజు కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. 

ప్రస్తుతం ఈ ఫార్ములా రేస్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అరవింద్ కుమార్ ఔటర్ లీజు విషయంలోనూ తానే అంతా వ్యవహారించినట్టుగా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయన హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో చేపట్టిన పనులకు సంబంధించి పాత ఫైళ్లను పునః పరిశీలించాలని భావిస్తున్నట్టుగా తెలిసింది.

వీటితో పాటు పలు ప్లై ఓవర్‌ల నిర్మాణాల టెండర్‌లు, పలు పార్కుల అభివృద్ధికి సంబంధించిన టెండర్‌లలోనూ ఆయన సొంతం నిర్ణయం తీసుకునేవారని పలువురు అధికారులు సైతం పేర్కొంటున్నారు. ఇక హెచ్‌ఎండిఏ లే ఔట్ అనుమతుల విషయంలో అడ్డగోలుగా అనుమతులు జారీ చేశారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ నుంచి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ పోటీలు జరగాల్సి ఉంది. 

అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేస్ పై నిర్వాహకులు సానుకూలంగా స్పందించలేదు. ఫార్ములా ఈ రేసును రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు గత వారం ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్ 9,10వ సీజన్‌ల కోసం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

కాగా పార్మూలా ఈ రేస్ నిర్వహణకు గాను ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్‌ఎండిఏ నుంచి రూ. 54 కోట్లు బదిలీ చేశారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు ఎవరు అధికారం ఇచ్చారని మెమోలో సిఎస్ ప్రశ్నించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసిందని ప్రభుత్వం ఆ మోమోలో పేర్కొంది.