నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడులతో భారత్ ఎగుమతులకు ముప్పు 

* భారత్ కు రూ. 2.5 లక్షల కోట్ల నష్టం

ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడులతో భారతీయ వర్తక, వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు నెలకొన్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్ల వరకు క్ష్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్గించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2022-23లో భారత్‌ నుంచి 451 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. అయితే ఈ 2023-24లో 421 బిలియన్‌ డాలర్లకే పరిమితం కావచ్చని రిసెర్చ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌ (ఆర్‌ఐఎస్‌) చెప్తున్నది. 

దీంతో 30 బిలియన్‌ డాలర్ల (రూ.2.50 లక్షల కోట్లు) వరకు పడిపోవచ్చని తెలుస్తున్నది.  ఇటీవల ఎర్ర సముద్రంలో కార్గో ఓడలకు వచ్చే బెదిరింపులతో షిప్పింగ్‌ రేట్ల పెరుగుదలకు దారితీయడంతో పాటుగా ఎగుమతిదారులు ఎగుమతులను నిలిపివేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న  ఆర్‌ఐఎస్‌ ప్రాథమికంగా అంచనా వేసింది.

”ఎర్ర సముద్రంలో సంక్షోభం భారత వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది మరింత పతనానికి దారితీయవచ్చు” అని ఆర్‌ఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ సచిన్‌ చతుర్వేది పేర్కొన్నారు. కాగా.. ఎర్ర సముద్ర సంక్షోభం దేశ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపవచ్చనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

అంతేగాక ప్రయాణ ఖర్చులు, కంటైనర్లలోని సరకులకు సంబంధించిన బీమా ప్రీమియంలూ భారంగా తయారయ్యాయి. దీంతో ఎగుమతిదారులు వెనుకడుగు వేస్తున్నట్టు సచిన్‌ చతుర్వేది చెప్తున్నారు. ఇప్పటిక భారతీయ ఎగుమతిదారులు 25 శాతం ఎగుమతుల్ని ఆపేసినట్టు దేశీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు. 

ఇక గత నెల ప్రథమార్ధంతో పోల్చితే ఇప్పుడు ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే నౌకలు దాదాపు 44 శాతం తగ్గాయని ప్రపంచంలోనే అతిపెద్ద షిప్‌ బ్రోకర్‌ క్లార్క్‌సన్‌ రిసెర్చ్‌ గుర్తుచేస్తున్నది. సరకు రవాణా సామర్థ్యం కూడా 40 లక్షల టన్నుల నుంచి 25 లక్షల టన్నులకు తగ్గిందంటున్నది. యెమెన్‌కు చెందిన ఇరాన్‌ మద్దతుగల హౌతీ మిలిటెంట్లు ఇటీవలి ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తున్న నౌకలను క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటున్నారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఎర్ర సముద్రం ద్వారా ఐరోపా, ఈస్ట్‌ కోస్ట్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికన్‌ దేశాలకు భారత్‌ సరుకు రవాణ చేస్తోంది. 

 ఆసియా నుండి ఉత్తర ఐరోపాకు 40 అడుగుల కంటైనర్‌లో వస్తువులను రవాణా చేసే వ్యయాలు 173 శాతం పెరిగాయని చెబుతున్నారు. ఆసియా నుండి ఉత్తర అమెరికా తూర్పు తీరం వరకు ధరలు 40 అడుగుల కంటైనర్‌కు 55 శాతం పెరిగి 3,900 డాలర్లకు చేరుకున్నాయన్నారు. 

భారత్‌ సాధారణంగా ఎర్ర సముద్ర మార్గాన్ని ఉపయోగించి పెట్రోలియం ఉత్పత్తులు, తృణధాన్యాలు, రసాయనాలతో సహా అనేక రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ సమయంలో ఎగుమతులు 6.5 శాతం పతనమయ్యాయి. అధిక గ్లోబల్‌ రవాణ ఛార్జీలు, బీమా రేట్లు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హౌతి తిరుగుబాటుదారుల దుశ్చర్యతో హిందూ మహాసముద్రంలో భాగమైన అరేబియా సముద్రం ద్వారా భారత్‌ నుంచి ఐరోపా, అమెరికా ఈస్ట్‌ కోస్ట్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా దేశాలకు జరిగే వాణిజ్యం ఇబ్బందుల్లో పడింది. మెడిటరేనియన్‌ సముద్ర తీరంలోని ఆయా దేశాలకు బాబ్‌ ఎల్‌-మండేబ్‌ జలసంధి ద్వారా ఎర్ర సముద్రం మీదుగా సూయెజ్‌ జలసంధి నుంచే భారతీయ ఎగుమతులు చేరుతున్నాయి.

అలాంటిది బాబ్‌ ఎల్‌-మండేబ్‌ జలసంధిపై హౌతి తిరుగుబాటుదారుల దాడులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది.  దీంతో ఈ రూట్‌కు ప్రత్యామ్నాయం కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ చుట్టూ తిరిగి వెళ్లడమే. ఇలా వెళ్తే 6వేల కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. అదనంగా 10 రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు మరో 10 లక్షల డాలర్లదాకా ఇంధన ఖర్చు అవుతుంది.

ఈ క్రమంలో బీమా వ్యయం కూడా భారంగానే తయారవుతుంది. ఇక ఇదే మార్గం గుండా భారత్‌కు ముడి చమురు దిగుమతులూ జరుగుతున్నాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.