మాల్దీవుల రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు

భారత్‌ పట్ల మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు, అధికారులు, రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ క్రమంలోనే భారత్‌లో మాల్దీవుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పర్యాటకం కోసం మాల్దీవులకు వెళ్లేవారు ఆ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు. 
 
విమాన టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. మాల్దీవుల రాయబారికి సమన్లు జారీ చేసింది.  ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై, భారత పర్యాటకంపై మాల్దీవులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీలోని ఆ దేశ రాయబారి ఇబ్రహీం షహీబ్‌కు విదేశాంగ శాక సమన్లు జారీ చేసింది. 
 
ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి సోమవారం ఉదయం ఢిల్లీలోని మాల్దీవుల హై కమిషనర్‌ ఇబ్రహీం షహీబ్‌ వెళ్లారు.  ఈ సందర్భంగా ఈ మొత్తం ఘటనపై వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖ ఇబ్రహీం షహీబ్‌కు స్పష్టం చేసింది.   ఈ పరిణామం జరగగానే, భారత దేశ హై కమీషనర్ మును మహావార్ ను తమ విదేశాంగ శాఖ కార్యాలయంకు సోమవారం మధ్యాన్నం 12.30 గంటలకు చేరుకోమని మాల్దీవుల ప్రభుత్వం కోరింది.
 
మోదీ లక్షద్వీప్‌ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం అయ్యాయి.  ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో మాల్దీవులు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
 
సోషల్‌ మీడియాలో భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మాల్షా షరీఫ్‌, మరియం షువానా, అబ్దుల్లా మాజిద్‌ సహా వివిధ అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.  భారత్‌పై తమ దేశానికి చెందిన వారు చేసిన వ్యాఖ్యలు వారి సొంత ఆలోచనలు మాత్రమేనని, వాటికి మాల్దీవుల ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. 
 
భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని తమ ప్రభుత్వం నమ్ముతుందని.. అలాంటి భావ ప్రకటనా స్వేచ్ఛను ద్వేషాన్ని, ప్రతికూలతను వ్యాప్తి చేయకూడదని పేర్కొంది. అలాగే మరే ఇతర దేశాలతో మాల్దీవుల సంబంధాలను ప్రభావితం చేయకూడదని తెలిపింది.