ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు చేయించండి

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థ‌ల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని, ప‌దో షెడ్యూల్ ప‌రిధిలోని సంస్థ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని, న్యూఢిల్లీలోని ఉమ్మ‌డి రాష్ట్ర భ‌వ‌న్ విభ‌జ‌న‌ను సాఫీగా పూర్తి చేయాల‌ని, చ‌ట్టంలో ఎక్క‌డా పేర్కొన‌కుండా ఉన్న సంస్థ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్లెయిమ్ చేసుకోవ‌డం విష‌యంపై దృష్టిసారించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్జ్ రెడ్డు విజ్ఞ‌ప్తి చేశారు.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను రేవంత్‌రెడ్డి ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో గురువారం సాయంత్రం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి చెందిన ప‌లు అంశాల‌ను అమిత్ షా దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు.  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌, హైకోర్టు భ‌వ‌నం, లోకాయుక్త‌, ఎస్‌హెచ్ఆర్సీ వంటి భ‌వ‌నాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వ‌డ్డీతో క‌లిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

తెలంగాణ రాష్ట్రానికి అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని  రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించార‌ని తెలిపారు. జిల్లాల విభ‌జ‌న‌, వివిధ శాఖ‌ల ప‌ర్య‌వేక్ష‌ణ నిమిత్తం రాష్ట్రానికి అద‌నంగా 29 అద‌న‌పు ఐపీఎస్ పోస్టులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. 
 
ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు.  తెలంగాణ‌లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బ‌లోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో బ‌లోపేతానికి రూ.90 కోట్లు అద‌నంగా కేటాయించాల‌ని కూడా ముఖ్య‌మంత్రి కోరారు.
 
మెట్రో రెండో దశ ప్రతిపాదనలు ఆమోదించండి

కాగా, హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌లు ఆమోదించాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి హ‌ర్‌దీప్‌సింగ్ పురీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని గురువారం సాయంత్రం క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌లను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు.

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ‌ను (బీహెచ్ఈఎల్‌-ల‌క్డీకాపూల్‌, నాగోల్‌-ఎల్‌బీ న‌గ‌ర్, 26 కి.మీ., రూ.9,100 కోట్ల అంచ‌నా వ్య‌యం), (విమానాశ్ర‌యం మెట్రో కారిడార్- రాయ‌దుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యం వ‌ర‌కు 32 కి.మీ, రూ.6,250 కోట్ల అంచ‌నా వ్య‌యం) స‌వ‌రించాల్సి ఉంద‌ని తెలిపారు. స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం ఈ ప్రాజెక్టును కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా చేప‌ట్టే విష‌యాన్ని ప‌రిగ‌ణించాల‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రిని కోరారు. 

హైద‌రాబాద్‌లోని మూసీ రివ‌ర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాట‌ర్ ఫాల్స్‌, చిల్డ్ర‌న్స్ వాట‌ర్ స్పోర్ట్స్‌, బిజినెస్ ఏరియా, దుకాణ స‌ముదాయాల‌తో బ‌హుళ విధాలా ఉప‌యోగ‌ప‌డేలా చేయాల‌నుకుంటున్న‌ట్లు కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.