ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను రేవంత్రెడ్డి ఢిల్లీ నార్త్బ్లాక్లోని ఆయన కార్యాలయంలో గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని రాజ్భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
కాగా, హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. కేంద్ర మంత్రిని గురువారం సాయంత్రం కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశను (బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీ నగర్, 26 కి.మీ., రూ.9,100 కోట్ల అంచనా వ్యయం), (విమానాశ్రయం మెట్రో కారిడార్- రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కి.మీ, రూ.6,250 కోట్ల అంచనా వ్యయం) సవరించాల్సి ఉందని తెలిపారు. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు.
హైదరాబాద్లోని మూసీ రివర్ ఫ్రంట్ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రికి వివరించారు.
More Stories
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
కర్ణాటకకు కుదిపేస్తున్న రేవణ్ణ సెక్స్ వీడియోలు
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం