మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలోని అద్భుతమైన శ్రీరామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక చేశారని, ఇది రాష్ట్రంలోని మొత్తం రామ భక్తుల గర్వాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసిందని కర్నాటకకు చెందిన బీజేపీ నేత యెడియూరప్ప ట్వీట్ చేశారు. ‘శిల్ప @yogiraj_arun’కు హృదయపూర్వక అభినందనలు” అని తెలిపారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్య రామ మందిర గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు.
కర్నాటకలోని మైసూరుకు చెందిన ఈ శిల్పి చెక్కిన అయిదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాగా, తాను చెక్కిన విగ్రహాన్ని అంగీకరించారా లేదా అనే దానిపై తనకు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని అరుణ్ తెలిపారు. “ఆ విగ్రహం దేవుని అవతారపు ప్రతిమ కాబట్టి ఆ విగ్రహం కూడా ఒక పిల్లవాడిదిగా ఉండాలి. విగ్రహాన్ని చూసిన ప్రజలు దైవత్వాన్ని అనుభూతి చెందాలి” అని చెప్పారు.
”చిన్నారిలాంటి ముఖంతో పాటు దైవత్వ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరేడు నెలల క్రితం నా పని ప్రారంభించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎంపిక కంటే ప్రజలు నా సృజనను మెచ్చుకోవాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను” అని శిల్పి అరుణ్ యోగి రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న శిల్పుల్లో ఒకరైన అరుణ్ యోగిరాజ్ చిన్న వయసులోనే శిల్ప ప్రపంచంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని తండ్రి యోగిరాజ్ , తాత బసవన్న శిల్పి ప్రఖ్యాత శిల్పులు.
ఇండియా గేట్ సమీపంలోని అమర్ జవాన్ జ్యోతి వెనుక ప్రముఖంగా కనిపించే సుభాష్ చంద్రబోస్ 30 అడుగుల విగ్రహంతో సహా ఆకట్టుకునే ఎన్నో శిల్పాలు అరుణ్ రూపొందించారు. కేదార్ నాథ్ లో 12 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్య శిల్పం నుంచి మైసూరులో 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం వరకు శిల్పకళా ప్రపంచంలో అరుణ్ తనదైన ముద్ర వేసిన శిల్పాలు చాలా ఉన్నాయి.
రాముడి విగ్రహం ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. డిసెంబర్ 30వ తేదీన ఆ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు చెందిన బోర్డు ట్రస్టీలు రామ్ లల్లా విగ్రహాలను పరిశీలించారు. పోటీలో ఉన్న మూడు విగ్రహాలను పరిశీలించి తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ట్రస్టుకు సమర్పించారు. కర్నాటక నుంచే మరో శిల్పి గణేశ్ భట్, రాజస్థాన్ నుంచి సత్యనారాయణ్ పాండేలు కూడా పోటీపడ్డారు. కర్నాటక శిల్పులు కృష్ణశిలను వాడగా, రాజస్థాన్ శిల్పి మాత్రం మక్రానా వైట్ మార్బుల్ను వాడారు. ముంబైకి చెందిన ఆర్టిస్టు వసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ల ఆధారంగా రామ్ లల్లాను డిజైన్ చేశారు.
More Stories
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం