వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించారు. ‘రష్యాలో మా స్నేహితుడిని చూసి సంతోషిస్తాం’ అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రష్యాలో ఉన్న భారత విదేశాంగమంత్రి జైశంకర్తో భేటీ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ తన స్థాయికి తగినట్లు ప్రయత్నం చేశారని పుతిన్ పేర్కొన్నారు. శాంతియుతంగా రష్యా సమస్యను పరిష్కరించుకునేందుకు సహకరిస్తున్న భారత్కు సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు. భారత్, రష్యా మధ్య వాణిజ్య టర్నోవర్ వృద్ధి చెందుతోందని ఆయన ప్రస్తావించారు.
ముడి చమురు, అత్యాధునిక టెక్నాలజీ రంగాలు ఇందుకు ప్రధానంగా దోహదపడుతున్నాయని పుతిన్ తెలిపారు. వరుసగా రెండవ సంవత్సరం చక్కటి వృద్ధి నమోదయిందని, గతేడాదితో పోల్చితే మరింత మెరుగుదల ఉందని ప్రస్తావించారు. మరోవైపు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్తో కూడా జైశంకర్ సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
వచ్చే ఏడాది జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ హాజరవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు అధినేతలు తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉంటారని జైశంకర్ పేర్కొన్నారు.
కాగా, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత ప్రధాని, రష్యా అధ్యక్షుల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య 21 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. చివరి సమావేశం 2021 డిసెంబర్లో న్యూఢిల్లీలో జరిగింది. వచ్చే ఏడాది సదస్సు రష్యాలో జరగనుంది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో కూడా ఇరు దేశాల సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు. దౌత్యపరమైన చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని సూచించిన విషయం తెలిసిందే.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ